ప్రజాకూటమి గెలుపు..  దేశ రాజకీయాలకే మేలు మలుపు


– ప్రజలకు సేవచేయడమే టీడీపీ తారకమంత్రం
– పార్టీ నాయకుల్లో అలసత్వం సహించబోను
– డిసెంబర్‌ 30న రాజమహేంద్రవరంలో ‘బీసీ జయ¬’ సభ
– సుజనా చౌదరిపై దాడులు రాజకీయ కక్ష సాధింపునకు పరాకాష్ట
– భాజపా నేతల వేధింపులను సమర్ధంగా ఎదుర్కొందాం
– తెదేపా నేతలతో టెలీకాన్ఫరెన్స్‌ లో ఏపీ సీఎం చంద్రబాబు
అమరావతి, నవంబర్‌28(జనంసాక్షి) : తెలంగాణలో ప్రజాకూటమి గెలుపు చారిత్రక అవసరమని, ఆ గెలుపు దేశ రాజకీయాలకే మేలుమలుపుగా ఉంటుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులతో ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం ఉదయం టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఆంధప్రదేశ్‌లో రైతులకు రూ.లక్షన్నర చొప్పున రుణమాఫీ చేస్తే.. తెలంగాణలో రూ.లక్ష మాత్రమే జరిగిందని ఆయన గుర్తు చేశారు. తెలంగాణలో డ్వాక్రా మహిళలకు రూపాయి ఇవ్వలేదని.. ఏపీలో ప్రతి డ్వాక్రా మహిళకూ రూ.10వేలు లబ్ధి చేకూరిందని వెల్లడించారు. ఏపీలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో 10లక్షల మందికి ఉపాధి లభిస్తే.. తెలంగాణలో అందులో సగం కూడా రాలేదన్నారు. ప్రభుత్వ భరోసాతో ఏపీలో రైతు ఆత్మహత్యలు ఆగితే, తెలంగాణలో 5వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ధనిక రాష్ట్రం తెలంగాణ నాలుగున్నరేళ్లలో అప్పుల పాలైందని, లోటు బడ్జెట్‌లో కూడా ఏపీ అద్భుత ప్రగతి సాధించిందని తెలిపారు. తెలంగాణలో తెలుగుదేశం కార్యకర్తలు సమర్థంగా పనిచేయాలని, ప్రజాకూటమి అభ్యర్థులను గెలిపించాలని దిశానిర్దేశం చేశారు. విజయనగరం ‘ధర్మపోరాటం’ విజయవంతమైనందుకు జిల్లా నేతలను అభినందించారు. మిగిలిన 3 ధర్మపోరాట సభలను కూడా విజయవంతం చేయాలని ఆదేశించారు. మితివిూరిన ఆత్మవిశ్వాసం మంచిది కాదని, బాధ్యత తీసుకోకుండా పదవుల్లో రాణించలేరని హితభోద చేశారు. ప్రజలకు సేవ చేయాలని,  పార్టీలో చురుగ్గా ఉండాలనేది తెలుగుదేశం తారకమంత్రమని చెప్పారు. ఇప్పటివరకూ 24,11,556 మంది సభ్యత్వ నమోదు పూర్తయిందని, దీన్ని మరింత ముమ్మరం చేయాలని చంద్రబాబు నేతలకు పిలుపునిచ్చారు. వ్యవస్థ నిర్మాణం, వనరుల సవిూకరణ విధానాల అమలు పకడ్బందీగా జరగాల్సి వుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రతి చోటా ప్రజల్లో ఉత్సాహం ఉందని, పార్టీ నాయకుల్లో అలసత్వం సహించబోనని చంద్రబాబు తేల్చిచెప్పారు. తిరుగులేని శక్తిగా తెలుగుదేశం రూపొందాలన్నారు. డిసెంబర్‌ 2 నుంచి డిసెంబర్‌ 23వరకు ‘బీసీ జయ¬’ సభలను నిర్వహించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా 30న రాజమహేంద్రవరంలో ‘బీసీ జయ¬’ భారీసభను విజయవంతం చేయాలని ఆకాంక్షించారు. ముస్లిం మైనారిటీల్లో సాధించిన పట్టును నిలబెట్టుకోవాలన్నారు. సుజనాచౌదరిపై దాడులు రాజకీయ కక్ష సాధింపునకు పరాకాష్టగా దుయ్యబట్టారు. రాజకీయ వేధింపులతో నరేంద్ర మోదీ బరితెగించారని మండిపడ్డారు. భాజపా నేతల వేధింపులను సమర్ధంగా ఎదుర్కొందామన్నారు.