ప్రజాసేవ పట్టని విపక్షనేత జగన్‌: టిడిపి

కర్నూలు,జనవరి22(జ‌నంసాక్షి): ప్రజాసేవలో ప్రభుత్వం తరిస్తుంటే ప్రతిపక్షనేత జగన్‌ అబద్ధాల మాటలు

చెబుతూ వారిని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్సీ కెఇ ప్రభాకర్‌ విమర్శించారు. ప్రజలే అతనికి బుద్ధి చెప్పాలని విజ్ఞప్తిచేశారు. విభజన తరవాత ఇప్పుడు ప్రజలు అభివృద్ది కోరుకుంటున్నారని అన్నారు. అన్నదాతల కుటుంబాల్లో ఆనందం చూడటమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. రాష్ట్రప్రభుత్వం ఈ విడత జన్మభూమిని వివిధ అంశాలతో ప్రజల ముందుకు తీసుకొచ్చిందన్నారు. ప్రజల వద్దకే ప్రభుత్వాధికారులు వస్తున్నారని, ప్రజల సమస్యలు విని పరిష్కరిస్తారని, ఇటువంటి వేదిక కల్పించిన ఘనత చంద్రబాబుదేనని పేర్కొన్నారు. రాయలసీమలోని అన్ని జిల్లాల్లోని చెరువుల్లో సాగు, తాగునీటిని నింపేందుకు నిధులు కేటాయించినట్లు తెలిపారు. రెండుకార్లకు పుష్కలంగా సాగునీరందిస్తామని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. ఎన్టీఆర్‌ ఆరోగ్యరక్ష, తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్‌లను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆహార భద్రతకు అర్హులైన ప్రతి పేదకుటుంబానికి బియ్యం కార్డు అందజేయడం తథ్యమన్నారు. నీటి సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందన్నారు. రేపటి భవిష్యత్తు కోసం ప్రజలు జన్మభూమిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.