ప్రణాళికాబద్ధంగా స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల నిర్వహణ:: సీఎస్ సోమేశ్ కుమార్

ప్రతి గ్రామంలో వన మహోత్సవం కింద మొక్కలు నాటాలి

ఫ్రీడం కప్ క్రింద గ్రామ స్థాయి నుంచి క్రీడా పోటీల నిర్వహణ

ప్రతి ఇంటి పై జాతీయ జెండా ఎగురవేయాలి

*స్వతంత్ర భారత వజ్రోత్సవాల నిర్వహణ పై జిల్లా కలెక్టర్ లు, పోలీస్ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎస్.
యాదాద్రి భువనగిరి బ్యూరో. జనం సాక్షి
జిల్లాలో ప్రణాళికాబద్ధంగా స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని సీఎస్ సోమేశ్ కుమార్ కలెక్టర్ లను ఆదేశించారు. వజ్రోత్సవ వేడుకల నిర్వహణ పై మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్ లతో సీఎస్ హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియోకాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ, డీసీపీ నారాయణ రెడ్డి, జడ్పీ ,సీఈఓ కృష్ణ రెడ్డి, జిల్లా అటవీ శాఖ అధికారి వెంకటేశ్వర రెడ్డి, కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ, వజ్రోత్సవ వేడుకలు నిర్వహించే కార్యక్రమాలకు జిల్లా స్థాయి లో కలెక్టర్ లు పక్కా కార్యాచరణ సిద్దం చేసుకొవాలని సీఎస్ సూచించారు. ఆగస్టు 10న ప్రతి గ్రామం, మున్సిపాలిటీ పరిధిలో ఫ్రీడం పార్క్ కింద కనీసం 75 మొక్కలు నాటాలని పేర్కొన్నారు. ఆగస్టు 11న ఉదయం 6.30 నుంచి 8.00 గంటల వరకు ప్రతి మండల కేంద్రంలో ఫ్రీడం రన్, ఆగస్టు 12న జాతీయ సమైక్యత కోసం రక్షాబంధన్ నిర్వహణ, ఆగస్టు 13న ప్రతి గ్రామంలో, మున్సిపాలిటీ లో జాతీయ జెండా, ఫ్లకార్డులతో విద్యార్థులు, ఉద్యోగులతో ఫ్రీడం ర్యాలీ నిర్వహించాలని, అనంతరం బేలూన్ లను గాల్లోకి వదలాలని తెలిపారు.
ఆగస్టు 14న ప్రతి నియోజకవర్గాలలో జానపద కళారూపాల ప్రదర్శన ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. ఆగస్టు 16న ఉదయం 11 గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి సామూహికంగా జాతీయ గీతాలాపన చేయాలని సీఎస్ పేర్కొన్నారు.
ఆగస్టు 17న ప్రతి నియోజకవర్గంలో బ్లడ్ డొనేషన్ క్యాంపు ఏర్పాటు చేయాలని తెలిపారు. జిల్లాలో ప్రతి గ్రామం పరిధిలో క్రీడా పోటీలు నిర్వహించాలని, ఆగస్టు 11,12 న గ్రామ స్థాయిలో, ఆగస్టు 13,14న మండల స్థాయిలో, ఆగస్టు 16,17న జిల్లా స్థాయి పోటీలు నిర్వహించాలని, ఆగస్టు 18న ఫ్రీడం కప్ చివరి పోటిలు నిర్వహించి విజేతలను నిర్ణయించాలని తెలిపారు. ఆగస్టు 19న జిల్లాలో ఉన్న ప్రతి వృద్ధాశ్రమం, ఆసుపత్రి, అనాథ శరణాలయంలో స్వీట్, పండ్లు పంపిణీ జరగాలని, ఆగస్టు 20న రంగోలి పోటీలు, ఆగస్టు 21న గ్రామ పంచాయతీ, మండల, జడ్పీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని తెలిపారు. ప్రతిరోజు నిర్వహించే కార్యక్రమాలపై ఎప్పటికప్పుడు సంబంధిత సమాచారంతో నివేదికలు పంపాలని సిఎస్ ఆదేశించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ, డీసీపీ నారాయణ రెడ్డి, జడ్పీ సీఈఓ కృష్ణ రెడ్డి, జిల్లా అటవీ శాఖ అధికారి వెంకటేశ్వర రెడీ,సంబంధిత వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, తదితరులు పాల్గొన్నారు.