ప్రతీకారం తీర్చుకున్న ఆర్మీ

కాల్పుల్లో ఇద్దరు పాక్‌ రేంజర్లు హతం

శ్రీనగర్‌,ఆగస్ట్‌14( జ‌నం సాక్షి ): చొరబాటు దారులకు అండగా నిలుస్తూ ఓ సైనికుడిని బలిగొన్న మరుసటి రోజే పాకిస్తాన్‌ రేంజర్లపై భారత ఆర్మీ ప్రతీకారం తీర్చుకుంది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన ఇద్దరు పాక్‌ సైనికులను మట్టుబెట్టింది. సోమవారం రాత్రి కుప్వారా జిల్లాలోని తంగ్దార్‌ సెక్టార్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. నియంత్రణ రేఖ వద్ద పహారా కాస్తున్న జవాన్లపై పాక్‌ రేంజర్లు కాల్పులకు తెగబడడంతో.. అంతే స్థాయిలో సైన్యం ఎదురుకాల్పులు జరిపినట్టు అధికారులు వెల్లడించారు.చొరబాటుదారులు భారత్‌లోకి ప్రవేశించేలా పాకిస్తాన్‌ ఆర్మీ సోమవారం పలుమార్లు ప్రయత్నించింది. వాటిని తిప్పికొట్టే క్రమంలో ఇరువైపులా భీకర కాల్పులు చోటుచేసుకున్నాయి. కాగా సోమవారం ఇదే సెక్టార్‌లో చొరబాటు దారులను అడ్డుకునేందుకు ప్రయత్నించిన భారత సైనికుడు పుష్పేంద్ర సింగ్‌ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.