ప్రపంచం అంతా మన ఆహారం తినాలి

ప్రకృతి వ్యవసాయ సదస్సును ప్రారంభోత్సవంలో బాబు
10 రోజుల పాటు  జరగనున్న ప్రకృతి వ్యవసాయ సదస్సు
గుంటూరు,డిసెంబర్‌8(జ‌నంసాక్షి): ‘ప్రపంచం అంతా మన ఆహారం తినాలి’ అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. సేంద్రియ వ్యవసాయం మన విధానం కావాలని అన్నారు. దీంతో ఖర్చు తక్కువే కాకుండా ప్రజల ఆరోగ్యానికి కూడా రక్షణ ఉంటుందని అన్నారు. జిల్లాలో ప్రకృతి వ్యవసాయం సదస్సును సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలుగున్నరేళ్లలో 10.52 శాతం వృద్ధి సాధించామని తెలిపారు. సంపద సృష్టించాలంటే అభివృద్ధి జరగాలన్నారు. ప్రకృతి వ్యవసాయానికి ఎంతైనా ఖర్చు చేస్తామని స్పష్టం చేశారు. ప్రకృతి వ్యవసాయంలో ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనంద బాబు, ప్రకృతి వ్యవసాయ పితామహుడు సుభాష్‌ పాలేకర్‌ పాల్గొన్నారు. ఈ నెల 17 వరకు 10 రోజుల పాటు ప్రకృతి వ్యవసాయ సదస్సు జరగనుంది. వేలాది మంది రైతులు శిక్షణ కోసం ఈ సదస్సుకు హాజరుకానున్నారు.