ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన వైద్యం

వైద్యుల ఖాళీలను భర్తీ చేస్తాం: మంత్రి ఫరూక్‌

అమరావతి,నవంబర్‌19(జ‌నంసాక్షి): రోగులకు ప్రభుత్వ ఆస్పత్రులలో మెరుగైన సేవలు కల్పించాలని నిర్ణయించామని వైద్యవాఖ మంత్రి ఎన్‌ఎండి ఫరూక్‌ అన్నారు. వైద్యుల కొరత ఉన్న చోట ఖాళీలు భర్తీ చేస్తామన్నారు. వైద్య ఆరోగ్య, మైనారిటీ శాఖ మంత్రిగా ఎన్‌ఎండీ ఫరూక్‌ సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన పేదల సంక్షేమం కోసం వైద్య సేవలకు ప్రభుత్వం ఏటా రూ.8వేల కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. స్వైన్‌ ఫ్లూ కేసులు కర్నూల్‌ జిల్లాలో ఎక్కువగా నమోదుయ్యాయని తెలిపారు.నకిలీ సర్టిఫికెట్లతో వైద్యం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించామన్నారు. మెడికల్‌, మైనారిటీ శాఖల బాధ్యతలు అప్పగించిన సీఎం చంద్రబాబు నమ్మకాన్ని నిలబెడతామన్నారు. ప్రతి నెలా 35 లక్షల మంది ప్రభుత్వ ఓపీలకు వస్తున్నారని అన్నారు. రోగులకు మెరుగైన సేవలు అందించడమే వైద్య, ఆరోగ్య శాఖ లక్ష్యం అని పేర్కొన్నారు. ఆరోగ్య శ్రీ బకాయిలు దాదాపు రూ. 100 కోట్ల వరకు ఉన్నాయని తెలిపారు. వాటిని విడుదల చేయకుంటే.. సేవలు నిలిపివేస్తామని ప్రైవేటు ఆస్పత్రులు చెబుతున్నాయని, ఈ సమస్యపై సీఎంతో మాట్లాడి నిధులు విడుదలకు ప్రయత్నిస్తామని మంత్రి తెలిపారు. వైద్య సేవలకు ఆటంకం కలగకుండా చర్యలు తీసుకుంటామన్నారు.