ప్రమాదకర రోడ్డుకు పరిష్కారం చూపండి

చెంగిచెర్ల-మేడిపల్లి చౌరస్తా నుంచి చర్లపల్లి పనులు వెంటనే చేపట్టాలి
బోడుప్పల్ మేయర్ బుచ్చిరెడ్డికి డిప్యూటీ మేయర్ విజ్ఞప్తి
మేడిపల్లి – జనంసాక్షి
మూడేళ్ల క్రితం ప్రారంభించిన పనులను అర్ధాంతరంగా నిలిపివేయడం వల్ల ప్రజలకు, వాహనదారులకు తీవ్ర అంతరాయం కలుగుతోందని, కొన్నిసార్లు మరణాలు కూడా సంభవిస్తున్నాయని బోడుప్పల్ డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీ రవి గౌడ్ ఆందోళన వ్యక్తం చేశారు. అందువల్ల నిలిచిపోయిన చెంగిచెర్ల-మేడిపల్లి చౌరస్తా నుండి చర్లపల్లి వరకు ప్రధాన రహదారి పనులు వెంటనే పునప్రారంభించి పూర్తి చెయ్యాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం రోజున బోడుప్పల్ నగర పాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలో ఆమె మేయర్, కమిషనర్  లకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మూడేళ్ల నుండి సగంలో నిలిచిపోయిన రోడ్డు పనుల వల్ల ప్రయాణానికి సరైన రోడ్డు లేకపోయిందని, అతుకులు గుంతలతో తీవ్ర ప్రమాదకరంగా మారిన ఈ రోడ్డు ప్రాణాంతకంగా మారిందని తెలిపారు. ప్రయాణికులు, వాహనదారులు తరచూ ప్రమాదాలకు గురవుతూ గాయాలపాలవుతున్నారని చెప్పారు. కొన్ని సందర్భాల్లో ఈ ప్రమాదాల కారణంగా మరణాలు కూడా సంభవిస్తున్నాయని, కావున ఈ విషయమై తక్షణమే స్పందించి చెంగిచెర్ల-మేడిపల్లి చౌరస్తా నుండి చర్లపల్లి వరకు నిర్మించతలపెట్టిన ప్రధాన రహదారి రోడ్డు పనులు వెంటనే పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీ రవి గౌడ్ కోరారు.