ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహాన్ని పునర్నిమిoచాలి.

పినపాక నియోజకవర్గం నవంబర్ 02 (జనం సాక్షి): తెలంగాణ జాతిపితను ప్రజా ప్రతినిధులు మరిచిపోయారా? తెలంగాణ రాష్ట్ర సాధనకు కృషి చేసిన సారును అప్పుడే మరిచిపోయారా.. తెలంగాణకు దశ దిశగా మారిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ చేసిన సేవా గుర్తుకు రావడం లేదా.. ఇలాంటి సవలక్ష ప్రశ్నలకు తాజా పరిణామాలు అవుననే సమాధానం ఇస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే మణుగూరు మండలం బొంబాయి కాలనీలో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని కొంతమంది గుర్తు తెలియని దుండగులు నవంబర్ 18 2021 విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఆరోజు విశ్వబ్రాహ్మణ సంఘాలు ప్రజా ప్రతినిధులు తీవ్రంగా ఖండించారు. ఆ సమయంలో ప్రజా ప్రతినిధులు విగ్రహాన్ని వెంటనే పున: ప్రతిష్ట చేయిస్తామని హామీ ఇచ్చి నేటికీ సంవత్సరం కాలం గడుస్తున్న ఇప్పటివరకు అతి గతి లేకుండా పోయింది. ఇదేనా ప్రొఫెసర్ జయశంకర్ సార్ కి ఇచ్చే గౌరవం దేనికోసమేనా ఆయన తెలంగాణ కోసం అహర్నిశలు శ్రమించింది. జయశంకర్ సార్ తో పాటు ఎంతోమంది విశ్వబ్రాహ్మణులు తెలంగాణ కోసం ప్రాణ త్యాగాలు చేశారు. తెలంగాణ కోసం ఎంతో శ్రమించిన జాతిపితకు జయశంకర్ సార్ విగ్రహం ఏర్పాటు చేయడానికి ఎందుకింత నిర్లక్ష్యం చేస్తున్నారని మణుగూరు మండల విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఈ సందర్భంగా విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో దివంగత ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయా సాధన ఎలాంటిదో ప్రతి తెలంగాణ బిడ్డను అడిగితే తెలుస్తోంది. టిఆర్ఎస్ అధినేతగా కేసీఆర్ ఉద్యమాన్ని ఉరకలెత్తించే సమయంలో ఆయన సలహాలు సూచనలు ఏ మేరకు పని చేశాయో తెలంగాణలో ప్రతి ఒక్కరికి తెలుసు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన పడ్డ తపన ఎలాంటిదో మనందరికీ తెలుసు అలాంటి గొప్ప ఆచార్యుడికి ఈనాడు ఎలాంటి గౌరవం దక్కుతుందో అర్థం కావడం లేదు. కూల్చిన విగ్రహానికి కనీస రక్షణ లేకుండా వదిలేశారు. తెలంగాణ ఉద్యమానికి ఊతమిచ్చి ప్రజలకు విముక్తి పాటలు నేర్పిన మహోపాధ్యాయులు ఆజన్మాంతం తెలంగాణ నే స్వప్నించి శ్రమించిన కర్మయోగి, తెలంగాణ దిక్సూచి ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ ను ప్రజా నాయకులు మరిచిపోయారా? చేసిన సేవను శ్రమను పడ్డా కష్టాన్ని అప్పుడే మర్చిపోయారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మణుగూరు మండల విశ్వబ్రాహ్మణుల డిమాండ్,: ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ నూతన విగ్రహాన్ని మణుగూరు తెలంగాణ చౌరస్తా (పూల సెంటర్) లో ఏర్పాటు చేయాలని విశ్వబ్రాహ్మణ సంఘ నాయకులు డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై సంవత్సరాలు గడుస్తున్న విశ్వబ్రాహ్మణులకు ప్రభుత్వం మొండి చెయ్యి చూపించింది. ఇప్పటివరకు ఎలాంటి రాయితీ పొందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని వర్గాల వారికి ఆర్థిక చేయూత స్వయం ఉపాధి కల్పించారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు ఏ ఒక్క విశ్వ బ్రాహ్మణునికి ప్రభుత్వ రుణాలు అందలేదు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు అధికారులు స్పందించి నిరుపేద విశ్వబ్రాహ్మణులకు ఆర్థిక చేయూతను అందించాలని కోరారు.