ఫిబ్రవరి 1నే బడ్జెట్‌

` ఆ రోజు ఆదివారమైనా కేంద్రం ముందుకే…
` 28 నుంచే పార్లమెంట్‌.. రెండువిడతల్లో సమావేశాలు
` 28 నుంచి ఫిబ్రవరి 13 వరకు తొలి.. మార్చి 9 నుంచి ఏప్రిల్‌ 2 వరకు రెండో విడత
న్యూఢల్లీి(జనంసాక్షి):పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు ఈనెల 28వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. 2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. ఈ మేరకు రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ సారథ్యంలోని పార్లమెంటు వ్యవహారాల కేబినెట్‌ కమిటీ ఆమోదం తెలిపినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అయితే తేదీలపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.ఈ బడ్జెట్‌ సమావేశాలు రెండు విడతల్లో జరగనున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. తొలి విడత పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు ఈనెల 28వ తేదీ నుంచి ఫిబ్రవరి 13 వరకు, రెండోవిడత సమావేశాలు మార్చి 9 నుంచి ఏప్రిల్‌ 2 వరకు జరగనున్నాయి. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ఫిబ్రవరి ఒకటో తేదీన ఆదివారం వార్షిక బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. ఇటీవలికాలంలో కేంద్ర బడ్జెట్‌ను ఆదివారం ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారి అని తెలుస్తోంది. ఈనెల 28న పార్లమెంటు ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదిముర్ము ప్రసంగంతో బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అయితే ఈనెల 29న ప్రభుత్వం ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టనుంది. అయితే ఒకప్పుడు ఫిబ్రవరి నెల చివరి రోజు బడ్జెట్‌ ప్రవేశపెట్టే సంప్రదాయం ఉండేది. అయితే దాన్ని 2017లో ఫిబ్రవరి 1కి మార్చారు. అయితే, ఈ సారి ఫిబ్రవరి నెలలో మొదటి తేదీ ఆదివారం కావడంతో బడ్జెట్‌ ప్రవేశపెట్టే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. స్టాక్‌ మార్కెట్‌ సహా ఇతర ఆర్థిక కార్యకలాపాలేవీ ఆ రోజు జరగవు. దీంతో బడ్జెట్‌ ప్రవేశపెట్టే తేదీ ఏమైనా మారుస్తారా? అన్న విషయంపై చర్చ జరుగుతోంది. అయితే, ఈ తేదీ మార్చకూడదని ప్రభుత్వం భావిస్తోందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.మరోవైపు జనవరి 30, 31 తేదీల్లో సెలవులు రానున్నాయి. రెండో దశ సమావేశాలు మార్చి 9 నుంచి ఏప్రిల్‌ 2 వరకు జరిగే అవకాశం ఉంది. వరుసగా తొమ్మిదోసారి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. అత్యధికంగా బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా మొరార్జీ దేశాయ్‌ రికార్డు ఉంది. ఆయన రెండు దఫాల్లో 10 సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు