ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయం


ఉద్యోగం పేరుతో 16.50 లక్షలు లూటీ
నిందితుడిని అరెస్ట్‌ చేసిన పోలీసులు
రాజమహేంద్రవరం,నవంబర్‌28(జనంసాక్షి):  ఫేస్‌బుక్‌లో పరిచయమైన యువతికి మాయమాటలు చెప్పి రూ.16.50 లక్షలు కాజేసిన తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం వేమగిరికి చెందిన మద్దెల దీపుబాబు అలియాస్‌ దీపక్‌ను బొమ్మూరు పోలీసులు అరెస్ట్‌ చేశారు. అతడి నుంచి రూ.10 వేలు, ఒక ఏటీఎం కార్డును
స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు గతంలోను ప్రజాప్రతినిధులు, పారిశ్రామికవేత్తలకు మొబైల్‌ ఫ్యాన్సీ నంబర్లు ఇస్తానని చెప్పి రూ.30 లక్షలు కాజేసిన కేసులో జైలు శిక్ష అనుభవించాడు. దీపక్‌ ఏపీ సెక్రటరీయేట్‌లో ఉద్యోగం చేస్తున్నానని చెబుతూ ఫేస్‌బుక్‌లో పలు పరిచయాలు పెంచుకున్నాడు. శాటిలైట్‌ సిటీ గ్రామానికి చెందిన దొండపాటి దుర్గ అనే యువతికి దీపక్‌ ఫేస్‌బుక్‌లో పరిచయమయ్యాడు.
ఆమె పిన్నికుమార్తె బోనగిరి శేషారత్నానికి న్యాయశాఖలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఆమె తల్లిదండ్రుల నుంచి తన అకౌంట్‌లో రూ.16.50 లక్షలు వేయించుకున్నాడు. సొమ్ములు చెల్లించినా ఉద్యోగం రాకపోవడంతో అనుమానం వచ్చి నిలదీయగా, వారిని నమ్మించేందుకు బెంగళూరులో ఇటీవల జరిగిన న్యాయశాఖ ఉన్నతాధికారులు సమావేశం వద్దకు తీసుకువెళ్లి అపాయింట్‌మెంట్‌ లెటర్‌ తయారవుతోందని, ఉద్యోగం వచ్చేస్తుందని నమ్మించాడు. నెలలు గడుస్తున్నా ఉద్యోగం రాకపోవడంతో ఈ నెల13న శేషారత్నం తాత ఊరా రాముడు బొమ్మూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. తాను వసూలు చేసిన సొమ్మును హైదరాబాద్‌, బెంగళూరులలో గుర్రపు పందాలు, స్టార్‌ ¬టళ్లలో దిగి వాడేసినట్లు నిందితుడు తెలిపాడు. నిందితుడికి స్కేటింగ్‌లో కుడికాలు పోయిందని..కృత్రిమ కాలును ఏర్పాటు చేసుకుని ఈ ఘాతుకాలకు పాల్పడుతున్నాడని రాజమహేంద్రవరం అర్బన్‌ జిల్లా తూర్పుమండల డీఎస్పీ యు.నాగరాజు తెలిపారు.