బంగ్లాదేశ్‌లో మురికివాడ దగ్దం:11మంది మృతి

ఢాకా: నగర శివార్లలో భారీ మురికివాడలో ఆదివారం సంభవించిన ఆగ్ని ప్రమాదంలో పిల్లలు,మహిళలు సహా కనీసం 11మంది ప్రజలు మరణించారు. పలువురు గాయపడ్డారు. ఇక్కడి హజారిబాగ్‌ ప్రాంతంలో మస్కిటో కాయిల్‌ నుంచి రాజుకున్న అగ్గి వెంటనే యావత్‌ మురికివాడను దగ్దం చేసిందని అధికారులు తెలిపారు. ”భస్మీపటలమైపోయిన 11 మృతదేహాలను వెలికితీశాం..తీవ్రమైన కాలిన గాయాలతో బాధపడుతున్న ఏడుగురుని ఆసుపత్రిలో చేర్చాం” అని అగ్నిమాపక అధికారి రుహుల్‌ అమీన్‌ వివరించారు. అయితే మృతుల సంఖ్య14కు చేరుకుందని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నట్టుగా పలు ప్రైవేట్‌ టీవీ చానెళ్లు ఉటంకించాయి. స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున దాదాపు మూడు గంటలకు అగ్నికీలలు మొదలయ్యాయని వార్త కథనాలు పేర్కొన్నాయి.స్వల్ప వ్యవధిలోనే అగ్నిమాపక శకటాలు సంఘటన స్థలికి చేరుకున్నాయి.కానీ మంటలను చల్లార్చటానికి అగ్నిమాపక సిబ్బందికి చాలా సమయం పట్టింది.