బాగ్దాద్లో బాంబుల మోత
– 165 మంది మృతి
– 200 మందికిపైగా గాయాలు
బాగ్దాద్,జులై 3(జనంసాక్షి):ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఇరాక్ లో నరమేధం సృష్టించారు. శనివారం అర్థరాత్రి సమయంలో రాజధాని బాగ్దాద్ లో వరుస బాంబు పేలుళ్లతో రాక్షసకాండ సాగించారు. షియా ముస్లింలను లక్ష్యంగా చేసుకుని ముష్కర మూక బాంబు దాడులకు తెగబడింది. రద్దీగా ఉన్న వాణిజ్య సముదాయాలను లక్ష్యంగా చేసుకొని జరిగిన ఈ దాడుల్లో 165 మంది మృతి చెందగా.. 200 మందికి పైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య 125గా బీబీసీ పేర్కొంది. ఎంత మంది మృతి చెందారనేది ఇరాక్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించలేదు. .నగరంలోని రద్దీ ప్రాంతాలైన కరాదా, షల్లాల్ మార్కెట్ వద్ద ఈ పేలుళ్లు సంభవించాయి. తొలుత కరాదా వద్ద కారులో వచ్చిన ఓ వ్యక్తి తనను తాను పేల్చుకుని ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన జరిగిన కొద్ది సేపటికే షల్లాల్ మార్కెట్లో మరో పేలుడు సంభవించింది.రంజాన్ మాసం సందర్భంగా షాపింగ్ మాల్స్ ప్రాంతాలు రద్దీగా ఉండటంతో మృతుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. కర్రాడ ప్రాంతంలో జరిగిన మొదటి దాడిలో ఉగ్రవాదులు రిఫ్రిజిరేటర్లు, కారులో పేలుడు పదార్దాలను నింపి పేల్చివేశారు. ఈ ఘటనలో వంద మందిపైగా మందికి పైగా మృతి చెందారు. భారీ పేలుడు దాటికి చుట్టుపక్కల భవనాలు, వాహనాలు ధ్వంసమయ్యాయి. ఎటుచూసినా మృతదేహాలతో ఈ ప్రాంతమంతా భీతావహంగా మారింది. అల్ షాబ్ ప్రాంతంలోని మార్కెట్ వద్ద జరిగిన కారుబాంబు దాడిలో ఐదుగురు మృతి చెందారు. 16 మంది గాయపడ్డారు.ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్టు ప్రకటించారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. ఘటనా స్థలానికి వచ్చిన ప్రధాని హైదర్ అల్-అబాదిపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ నుంచి ఫాజుల్లా నగరాన్ని ఇరాక్ బలగాలు స్వాధీనం చేసుకున్నందుకు ప్రతీకారంగా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడినట్టు అనుమానిస్తున్నారు.. సున్నీ ముస్లిం అతివాదుల సంస్థ అయిన ఇస్లామిక్ స్టేట్ ఈ దాడికి తామే పాల్పడినట్లు ఆన్లైన్లో ప్రకటించింది. రంజాన్ సందర్భంగా ఉపవాసం అనంతరం భోజనాలు చేస్తున్నవారిపై ఈ దాడి జరిగింది. వీథిలో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. నాలుగు భవంతులు పాక్షికంగా కూలిపోయాయి. ఈ కారుబాంబుతో పాటు అల్ షాబ్ మార్కెట్లో రోడ్డు పక్కన మరొక బాంబును కూడా ఉగ్రవాదులు పేల్చారు. ఇక్కడ షియా ముస్లింలు అధికంగా ఉంటారు.




