బిజెపి వల్లనే ఎపికి అన్యాయం

ధర్మపోరాట దీక్షాస్థలి వద్ద ఏర్పాట్లను పరిశీలించిన నారాయణ

నెల్లూరు,నవంబర్‌19(జ‌నంసాక్షి): బిజెపి ప్రభుత్వ నిరంకుశత్వం వల్లే రాష్ట్రంలో రావల్సిన ఎన్నో భారీ ప్రాజెక్టులు వెనుకబడ్డాయని మంత్రి నారాయణ తెలిపారు. పోలవరం, అమరావతి నిర్మాణం వంటి కీలక విషయాల్లో కూడా కేంద్రం మోసపూరితంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. కోస్టల్‌ కారిడార్‌ , మెట్రో రైలు, విశాఖ రైల్వే జోన్‌, కడప ఉక్కు కర్మాగారం వంటి ఎన్నో భారీ ప్రాజెక్టులు రాకపోవడంతో నిరుద్యోగులకు నష్టం వాటిల్లిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలను ఆయుధంగా వాడుకుంటూ ప్రతిపక్షాలను ఇబ్బంది పెడుతోందన్నారు. ఈ కుట్ర రాజకీయాలను తిప్పికొట్టేందుకే చంద్రబాబు ధర్మ పోరాట దీక్ష చేపట్టారని పేర్కొన్నారు. స్థానిక వేణుగోపాల స్వామి కళాశాల మైదానంలో నిర్వహించనున్న ధర్మ పోరాట దీక్ష సభాస్థలిని మంత్రి నారాయణ సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ.. వర్షపాతాన్ని కూడా తట్టుకునే విధంగా వేదిక, గ్యాలరీ తయారవుతుందని తెలిపారు. ధర్మ పోరాట దీక్షను విజయవంతం చేసి నెల్లూరు జిల్లా ప్రజల సత్తా ఏమిటో కేంద్ర ప్రభుత్వానికి తెలపాలని పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని విడగొట్టడంలో సహకరించిన బిజెపి, హావిూలను అమలు చేయడంలో సహకరించడం లేదని విమర్శించారు.