బీజేపీ, ఏక్‌నాథ్‌ షిండే మధ్య ఒప్పందం తాత్కాలికమే

శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ వ్యాఖ్యలు
ముంబై,జూలై4(జ‌నంసాక్షి): బీజేపీ, ఏక్‌నాథ్‌ షిండే మధ్య జరిగిన ఒప్పందం తాత్కాలిక ఒప్పందం మాత్రమే అని శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ అన్నారు. శివసేనపై తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలు ప్రజల మధ్య తిరగలేరని చెప్పారు. శివసేనలో ఉన్న సమయంలో ఏక్‌నాథ్‌ షిండే వర్గం ఎమ్మెల్యేలు సింహాల్లా తిరిగే వారని..కానీ వారు ముంబైలో అడుగుపెట్టిన సమయంలో భారీ భద్రత ఏర్పాటు చేసుకున్నారని తెలిపారు. గతంలో టెర్రరిస్టు కసబ్‌కు కూడా కేంద్రం ఇంతగా భద్రత కల్పించలేదన్నారు. ఏక్‌నాథ్‌ షిండే
వర్గం ఎమ్మెల్యేలు దేనిగురించి భయపడుతున్నారని ప్రశ్నించారు. శివసేన పార్టీ అధికారంలోకి వచ్చాక బలంగా తయారు కాలేదన్నారు. బలంగా ఉంది కాబట్టే అధికారంలోకి వచ్చామని తెలిపారు. పార్టీలోకి ఎంతో మంది వస్తారు..పోతారన్నారు. ఎంత మంది పోయినా..పార్టీ బలహీనపడదని స్పష్టం చేశారు. మళ్లీ ప్రజల్లోకి వెళ్తామని..బలమైన కార్యకర్తలను తయారు చేస్తామన్నారు.