బీజేపీ వల్లే దేశానికి ప్రమాదం

– సీపీఐ జాతీయ నేత నారాయణ
ఒంగోలు, నవంబర్‌27(జ‌నంసాక్షి) : దేశాన్ని పాలిస్తున్న బీజేపీ వల్లనే దేశానికి ప్రమాదం పొంచి ఉందని సీపీఐ జాతీయ నేత కె. నారాయణ వ్యాఖ్యానించారు. ప్రకాశం జిల్లాలో నారాయణ విలేకరులతో మాట్లాడుతూ..ప్రధాని నరేంద్ర మోదీకి తన భార్యపై ఎంత ప్రేమ ఉందో.. రామాలయంపైన కూడా అంతే ప్రేమ ఉందని ఎద్దేవా చేశారు. ఎన్నికలు సవిూపిస్తుండటంతోనే మళ్లీ రామాలయ నిర్మాణాన్ని తెరపైకి తెచ్చారని ఆరోపించారు. సీబీఐని ఇస్కో అంటే ఉస్కో అనేలా తయారు చేశారని విమర్శించారు. సీబీఐ, ఆర్బీఐ, ఎన్నికల వ్యవస్థలను మోదీ తన వంటింటి కుందేలు మాదిరిగా తయారు చేశారని దుయ్యబట్టారు.
వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే ఇక ఎన్నికలు ఉండవని అన్నారు. రఫెల్‌  విమానాల స్పీడ్‌ కన్నా మోదీ అవినీతి ఇంకా స్పీడ్‌గా వెళ్తుందని ధ్వజమెత్తారు. ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్తున్నారో కేసీఆర్‌ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ ఎన్నికల అనంతరం కేసీఆర్‌ తన ఫాంహౌస్‌లో మిరపకాయలు పండించుకోవడం ఖాయమని ఎద్దేవా చేశారు. వచ్చే ఏపీ ఎన్నికల్లో అనేక మార్పులు
రాబోతున్నాయని చెప్పారు.