భక్తిశ్రద్ధలతో గురుపౌర్ణమి వేడుకలు

బోడుప్పల్, పీర్జాదిగూడలో కిటకిటలాడిన ఆలయాలు
– జనంసాక్షి
గురుపౌర్ణమి పర్వదిన వేడుకలను పీర్జాదిగూడ, బోడుప్పల్ జంట నగరాల ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా బుధవారం బోడుప్పల్, పీర్జాదిగూడ నగరాలలోని శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయాలు, శ్రీ షిరిడి సాయిబాబా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. పీర్జాదిగూడ బుద్ధనగర్ కాలనీలోని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షులు అనిల్ సింగ్, ప్రధాన కార్యదర్శి బొందుగుల కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఉదయం శ్రీ షిరిడి సాయిబాబాకు ప్రత్యేక పంచామృత అభిషేకం చేశారు. అనంతరం ప్రత్యేక పూజలు, అర్చనలు, నూతన వస్త్రాలంకరణ, పుష్పాలంకరణ, మంత్రపుష్పం, హారతి కార్యక్రమాలు నిర్వహించగా, సాయి కీర్తనలు, భజనలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. భక్తులకు తీర్థ ప్రసాద వితరణ అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని చేశారు. సాయిబాబాను దర్శించుకున్న వారిలో పీర్జాదిగూడ నగర మేయర్ జక్క వెంకట్ రెడ్డి, కార్పొరేటర్లు భీమ్ రెడ్డి నవీన్ రెడ్డి, అమర్ సింగ్, మద్ది యుగంధర్ రెడ్డి, నాయకులు వంగేటి ప్రభాకర్ రెడ్డి, వంగేటి బాల్ రెడ్డి, కాలనీ ప్రతినిధులు, మహిళలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.