భారత పర్వతారోహకుడి మృతి

కాఠ్‌మాండూ: నేపాల్‌లో భారత పర్వతారోహకుడు ఒకరు మృతిచెందారు. పశ్చిమ్‌ బంగాలోని హౌరా జిల్లాకి చెందిన రజిబ్‌ భట్టాచార్య(43) ప్రపంచంలోనే ఏడో ఎత్తైన పర్వతమైన ధవళగిరి(8,167మీ.)ని అధిరోహించేందుకు తన బృందంతో కలిసి వెళ్లాడు. విజయవంతంగా పర్వతారోహణ చేసిన రజిబ్‌ తిరుగు ప్రయాణంలో శుక్రవారం ఉదయం మంచు తీవ్రత ఎక్కువగా ఉండడంతో తాత్కాలిక అంధత్వానికి లోనయ్యాడు. ఆ క్రమంలోనే మృత్యువాత పడినట్లు సమాచారం.

ప్రస్తుతం అతని మృతదేహం క్యాంప్‌లోనే ఉందని మంచు తీవ్రత ఎక్కువగా ఉండడంతో కిందికి తీసుకురాలేకపోతున్నామని యాత్ర ఏర్పాట్లు చేసిన సెవెన్‌ సమిట్‌ ట్రెక్స్‌ సంస్థ సిబ్బంది పేర్కొన్నారు. రజిబ్‌ 2011లో ఎవరెస్ట్‌ పర్వతాన్ని, 2013లో కాంచన్‌జంగా పర్వతాన్ని అధిరోహించాడు.