భారత భద్రత ప్రయోజనాలను కట్టుబడి ఉన్నాం ` శ్రీలంక

కొలంబో(జనంసాక్షి):భారత భద్రతకు ముప్పు తలపెట్టే చర్యలను తాము అనుమతించబోమని శ్రీలంక విదేశాంగ మంత్రి అలీ సబ్రీ అన్నారు. పొరుగు దేశంగా అది తమ బాధ్యత అని స్పష్టం చేశారు. భారత భద్రత ప్రయోజనాలను పరిరక్షించేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. శ్రీలంక తీరాలకు చైనా పరిశోధక నౌక చేరడంపై భారత్‌ వ్యక్తం చేస్తున్న ఆందోళనలపైనా సబ్రీ స్పందించారు. తాము ఇతర దేశాలతో చాలా పారదర్శకంగా పనిచేస్తామని.. పొరుగు వారికి నష్టం కలిగించే చర్యలకు ఏమాత్రం ఆమోదం తెలపబోమని స్పష్టం చేశారు. భారత్‌ ఇతర దేశాలతో సంబంధాలు కొనసాగిస్తున్నట్లుగానే.. తమ విధానం కూడా ఉంటుందని వివరించారు. కానీ, ఇతరులకు హాని తలపెట్టే నిర్ణయాలను మాత్రం తీసుకోబోమని పేర్కొన్నారు.భారత్‌లో ఎన్నికలను ప్రజాస్వామ్య వేడుకగా అభివర్ణించిన సబ్రీ.. ఫలితాలపై స్పందించబోమని తెలిపారు. భారత ప్రజలు తెలివైనవారని.. ఎవరిని ఎన్నుకోవాలో వారికి తెలుసని వ్యాఖ్యానించారు. అంతర్గత అంశమైన ఎన్నికలపై అంతకు మించి తాము ఎలాంటి వ్యాఖ్యలు చేయదల్చుకోలేదన్నారు. ఎన్నికల ఫలితంతో సంబంధం లేకుండా భారత్‌తో తమ బంధం కొనసాగుతుందని తెలిపారు. చైనాకు చెందిన ఓ గూఢచార నౌక గత ఏడాది శ్రీలంక హంబన్‌టోట నౌకాశ్రయంలో కొన్ని రోజుల పాటు ఆగింది. దానికి పొరుగు దేశాల నావికాదళ కార్యకలాపాలపై నిఘా వేసే సామర్థ్యం ఉన్నట్లు భారత్‌ గుర్తించింది. దీనిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. తమ భద్రతకు హాని కలిగించే ఏ విషయంలోనైనా తాము జోక్యం చేసుకుంటామని ఇరు దేశాలకు తేల్చి చెప్పింది.