భారీగా కురిసిన వర్షాలకు గ్రామాలలో పొంగిపోర్లతున్న వాగులు వంకలు

సాతర్ల వాగుకు భారీగా వరదనీరు చేరడంతో ఆరు గంటలపాటు నిలిచిపోయిన ఆర్టీసీ బస్సు

ఇటిక్యాల (జనంసాక్షి) సెప్టెంబర్ 29 మండల కేంద్రంతో పాటు వావిలాల, ఉదండాపురం, చాగాపురం, సాబాద్, గోపాల్ దిన్నె, పెద్దదిన్నె, బట్లదిన్నె, మునగాల, నక్కలపల్లి, కోదండపురం, కొండేరు, జింకలపల్లి, శివనంపల్లి, ధర్మవరం, ఆర్ గార్లపాడు, షేక్ పల్లి, సాసనూలు, బి. వీరాపురంతో పాటు ఆయా గ్రామాలలో గురువారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు గ్రామాలలో భారీగా కురిసిన వర్షాల కారణంగా గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారులకు రాకపోకలు నిలిచిపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నారు. ఈ సందర్భంగా సాతర్ల గ్రామం నుండి వావిలాల గ్రామానికి వెళ్లే ప్రధాన రోడ్డు మార్గాన వంతెన నిర్మాణం చేపట్టకపోవడంతో పెద్ద వాగుకు భారీగా వరద నీరు చేరి గ్రామం మీదుగా గద్వాలకి వెళ్లే ఆర్టీసీ బస్సు అరు గంటలపాటు నిలిచిపోయింది. ప్రతి సంవత్సరము వర్షాకాలంలో భారీ వర్షాలు కురిస్తే వాగు ఉదృతంగా ప్రవహించి పంట పొలాలు సైతం నీటిలో మునిగిపోవటమే గాక అనారోగ్యంతో బాధపడుతున్న వారు వైద్యం కోసం ఇతర ప్రాంతాలకు వెళ్ళలేని పరిస్థితి నెలకొంటుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 44వ జాతీయ రహదారి నుంచి ఇటిక్యాల, సాతర్ల, వావిలాల గ్రామాల మీదుగా వెంకటాపురం ఐజ, రాయచూరుకు వెళ్లేందుకు ప్రధాన రహదారి కావడంతో వర్షకాలంలో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వివిధ గ్రామాల ప్రయాణికులు వాపోతున్నారు. గత రెండు సంవత్సరాల క్రితం వంతెన నిర్మాణం చేపట్టాలని సర్పంచ్ జై చంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఉన్నత అధికారులకు, ప్రజాప్రతినిధులకు, ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం అబ్రహం దృష్టికి తీసుకెళ్లి విన్నవించుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఇప్పటికైనా గ్రామస్తుల కష్టాలను గుర్తించి వాగు వంతెన నిర్మాణం చేపట్టి రాకపోకలకు అంతరాయం లేకుండా చూడాలని వారు విన్నవించుకున్నారు.

సాతర్ల గ్రామం వాగు ఉధృతను పరిశీలించిన రెవిన్యూ అధికారులు

మండల పరిధిలోని సాతర్ల గ్రామ సమీపంలో ఉన్న పెద్దవాకు భారీగా వరద నీరు చేరి ఉదృతంగా ప్రవహించడంతో గురువారం తహసిల్దార్ సుబ్రహ్మణ్యం, ఆర్ఐ సుదర్శన్ రెడ్డి పరిశీలించారు. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో వరద నీరు భారీగా చేరి రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన దుస్థితి నెలకొందని తాహసిల్దార్ కి గ్రామస్తులు విన్నవించుకున్నారు. తాహసిల్దార్ సుబ్రమణ్యం స్పందించి ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్తానని ఆయన అన్నారు.