భార్య.. భర్త సొత్తనడం రాజ్యాంగ విరుద్ధం

– ఆమె వేరొకరితో సంబంధం పెట్టుకున్నా నేరంగా పరిగణించలేం
– ఇష్టపూర్వకంగా శృగారం నేరంకాదు
– సంచలన వ్యాఖ్యలు చేసిన సుప్రింకోర్టు
– సెక్షన్‌ 497ను ఏకగ్రీవంగా కొట్టివేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం
– సెక్షన్‌ 497 పురాతన చట్టం.. అది ఏకపక్షంగా ఉందని వెల్లడి
న్యూఢిల్లీ, సెప్టెంబర్‌27(జ‌నంసాక్షి) : భారతదేశ వివాహ వ్యవస్థ విశ్వసనీయతతో కూడుకున్నదని, అయితే, పెళ్లి చేసుకున్న తరువాత భార్య భర్త సొత్తనడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఐపీసీ సెక్షన్‌ 497రాజ్యాంగ బద్ధత, అడల్టీప్రై చీఫ్‌ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలో విచారణ జరిపిన జస్టిస్‌ నారిమన్‌, జస్టిస్‌ చంద్రచూడ్‌, జస్టిస్‌ ఏఎమ్‌ ఖాన్విల్కర్‌, జస్టిస్‌ ఇందు మల్హోత్రాలతో కూడిన బెంచ్‌, ఈ సెక్షన్‌ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోందని ఏకగ్రీవంగా అభిప్రాయపడ్డారు. ఈ మేరకు గురువారం తీర్పును వెలువరించారు. వివాహమైన పురుషుడు భార్యతో కాకుండా మరొక స్త్రీతో లైంగికంగా కలిస్తే అది నేరం కాదని న్యాయస్థానం చెబుతున్న విషయాన్ని ప్రస్తావిస్తూ, అదే స్త్రీకి కూడా వర్తిస్తుందని, ఇద్దరి మధ్య పరస్పర అంగీకారంతో జరిగే కార్యంలో మహిళ బాధితురాలు కాదని, ఇద్దరిదీ సమాన బాధ్యతని ధర్మాసనం వ్యాఖ్యానించింది. వివాహం తర్వాత స్త్రీ తన వ్యక్తిత్వం కోల్పోయేలా ఈ చట్టం ఉందని తెలిపింది. చట్టాల పేరిట మహిళల వ్యక్తిగత గౌరవానికి భంగం వాటిల్లరాదని, వారికి కూడా స్వేచ్ఛ ఉండాల్సిందేనని, సెక్షన్‌ 497లోని ఎన్నో అంశాలు ఏకపక్షంగా కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా వివాహేతర సంబంధాలను (ఆడల్టరీ) నేరంగా పరిగణించే ఇండియన్‌ పీనల్‌ కోడ్‌లోని సెక్షన్‌ 497ను ఏకగ్రీవంగా కొట్టివేస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. మహిళలను తోటి మనుషులుగా కాకుండా వస్తువులుగా పరిగణిస్తున్నారని ఈ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది. వైవాహిక జీవితంలో అసంతృప్తికి వివాహేతర సంబంధాలు కారణం కాదని, వైవాహిక జీవితంలో అసంతృప్తి వల్లే ఇలాంటి సంబంధాలు తలెత్తుతున్నాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్‌ మిశ్రా వ్యాఖ్యానించారు.
సెక్షన్‌ 497 పురాతన చట్టం..
సెక్షన్‌ 497 ఒక పురాతన చట్టమని, అది ఏకపక్షంగా ఉందని సుప్రింకోర్టు అభిప్రాయపడింది. ఇష్టపూర్వక శృంగారాన్ని నేరంగా పరిగణించడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. సెక్షన్‌ 497తోపాటు సెక్షన్‌ 198 కూడా రాజ్యాంగ సమ్మతం కాదని వెల్లడించింది. సెక్షన్‌ 497 మహిళల  సమాన అవకాశాలను కాలరాస్తోందని, సమానత్వ హక్కులను తూట్లు పొడిచేలా ఇది ఉందని న్యాయస్థానం అభిప్రాయపడింది. మహిళలను సమానులుగా చూడని ఏ చట్టమైనా రాజ్యాంగ విరుద్ధమేనని, వివాహేతర సంబంధాల్లో పురుషులను మాత్రమే బాధ్యులను చేసే సెక్షన్‌ 497 సరికాదని, మహిళలకు కూడా సమాన హక్కులు ఉంటాయని పేర్కొంది. సెక్షన్‌ 497ను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది. భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కు అయిన సమానత్వపు హక్కును ఈ సెక్షన్‌ ఉల్లంఘిస్తున్నట్టు ప్రాథమికంగా కనిపిస్తోందని రాజ్యాంగ ధర్మాసనం గతంలో పేర్కొన్న సంగతి తెలిసిందే. వివాహేతర సంబంధాల విషయంలో వివాహితలను మినహాయించి.. పెళ్లయిన పురుషుడిని మాత్రమే శిక్షించే సెక్షన్‌ 497ను రద్దు చేయాలంటూ జోసెఫ్‌ సైనీ అనే వ్యక్తి ఈ పిటిషన్‌ దాఖలు చేశాడు.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ కేసును విచారిస్తోంది. ఈ ధర్మాసనంలో ఆర్‌ఎఫ్‌ నారీమన్‌, ఏఎం ఖన్విల్కర్‌, డీవై చంద్రచూడ్‌, ఇందూ మల్హోత్రా తదితర న్యాయమూర్తులు ఉన్నారు. వివాహ వ్యవస్థ పవిత్రతను కాపాడేందుకు సెక్షన్‌ 497ను కొనసాగించాల్సిన అవసరముందన్న కేంద్రం వాదనతో ధర్మాసనం ఏకీభవించలేదు. ఇదే వాదనను పాటించినట్టయితే ఇప్పుడున్న నేరం కన్నా తీవ్రమైన నేరంగా దీనిని పరిగణించాల్సి ఉంటుందని జస్టిస్‌ చంద్రచూడ్‌ వాదనల సందర్భంగా పేర్కొన్నారు.