మగవారితో మహిళలు ఎందులోనూ తీసిపోరు

అన్నిరంగాల్లోనూ వారు దూసుకుపోతున్నారు
పద్యావతి విశ్వవిద్యాలయం మహిళా దినోత్సవంలో ఎమ్మెల్యే రోజా
తిరుపతి,మార్చి4(జనం సాక్షి): మహిళలు మగవారికి ఎందులోనూ తీసిపోరు అని ఎమ్మెల్యే రోజా అన్నారు. నిజానికి మహిళలే ఈ సమాజానికి నిర్మాతలని చెప్పారు. ఒక్క రంగమంటూ లేకుండా అన్ని రంగాల్లోనూ నేడు మహిళలు దూసుకుపోతున్నారని ఆమె తెలిపారు.తిరుపతి శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవసంబరాలను శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నగరి నియోజకవర్గ శాసనసభ్యురాలు ఆర్‌ కే రోజా పాల్గని మహిళా దినోత్సవ సంబరాలు పవర్‌ వాక్‌ కార్యక్రమం ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ…ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం లింగ సమానత్వం సాధించడం కోసమేనని, భవిష్యత్తులో మహిళలు శారీరకంగా కూడా ధృఢంగా ఉండి దేశానికి గర్వకారణంగా నిలవడానికి కృషి చేయాలని కోరారు. దానికి ఈ పవర్‌ వాక్‌ కార్యక్రమం చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందని మహిళాలోకాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఒక మహిళగా మహిళలకు ఉన్న ఆసక్తిని తెలియపరచడానికి ఒక వేదిక దొరకడం, తనను ముఖ్య అతిథిగా ఆహ్వానించడం గౌరవంగా భావిస్తున్నానన్నారు. ఈరోజు నుంచి వారం రోజుల పాటు జరిగే అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంబరాలను విజయవంతంగా జరిపి మహిళల శక్తిని, మహిళల ప్రాముఖ్యతను ప్రపంచానికి తెలిసేలా కార్యక్రమం జరగాలని కోరారు. ఈ కార్యక్రమంలో పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్ల్సర్‌ జమున, రిజిస్టార్ర్‌ ప్రొఫెసర్‌ మమతా, ప్రొఫెసర్‌ సావిత్రి, ప్రొఫెసర్‌ శారద, ప్రొఫెసర్‌ సారు?? సరోజిని, ప్రొఫెసర్‌ సంధ్య, మిగతా మహిళా సభ్యులు, యూనివర్సిటీకి చెందిన టీచింగ్‌ అండ్‌ నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌ విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు