మత ప్రచారంతో ప్రజలను రెచ్చగొట్టే యత్నంలో బిజెపి
కేంద్ర ప్రభుత్వంతో సామాన్యులకు ఒరిగిందేవిూ లేదు
నోట్ల రద్దు, జిఎస్టీతో దేశ అభివృద్ది ఆగిపోయింది
జిఎస్టీ వసూళ్లుపెంచి రకం కట్టినా రాష్ట్రానికి చేసిందేవిూ లేదు
శ్రీదర్ రెడ్డి పార్టీలో చేరిన సందర్భంగా బిజెపిని ఏకిన కెటిఆర్
హైదరాబాద్,నవంబర్2(జనంసాక్షి): కేంద్రం సామాన్యుడికి చేసిందేముందని కేంద్రంపై మంత్రి కేటీఆర్ మరోసారి విరుచుకుపడ్డారు. నోట్ల రద్దుతో ఆర్థిక అభివృద్ధి ఆగిపోయిందని కేటీఆర్ చెప్పారు. కేటీఆర్ సమక్షంలో బీజేపీ నేత రావుల శ్రీధర్ రెడ్డి టీఆర్ఎస్లో చేరిన సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని లెక్కలతో సహా చూపిస్తామని సవాల్ విసిరారు. ఆరేళ్లలో రూ.2.72 లక్షల కోట్ల పన్నులు కేంద్రానికి ఇచ్చామని, తెలంగాణకు వచ్చింది రూ.1,43,329 కోట్లేనని తెలిపారు. అన్ని పథకాలకు తమ డబ్బులే అని బీజేపీ నేతలు చెబుతున్నారని, బీజేపీ నేతల ఇంట్లో డబ్బులు దొరికితే మాత్రం తమవి కావంటున్నారని మండిపడ్డారు. ఆరేళ్లలో ఏ ఎన్నికలు వచ్చినా టీఆర్ఎస్దే విజయమని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని తెలిపారు. అయినా విపక్షాలు తీరు మార్చుకోవడం లేదని అన్నారు. ఇకపోతే బీజేపీ నేతలు ప్రజలకు భ్రమలు కల్పించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ ఏం చేసిందో నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. విద్వేషపు విత్తనాలకు తెలంగాణలో చోటు లేదన్నారు. ప్రతి మతానికి తెలంగాణలో చోటు ఉంటుందని, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం ధర్మంకాదని, మతం తమకు ఎప్పటికి ప్రచారాస్త్రం కాదని కేటీఆర్ అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో కొందరు మతం పేరుతో చిచ్చు పెడుతున్నారు. తెలంగాణ మట్టిలో పరమత సహనం ఉంది. విద్వేషపు విత్తనాలకు తెలంగాణలో స్థానం లేదు. విద్వేషాలను రెచ్చగొడితే ప్రజలే బుద్ధి చెప్తారని కెటిఆర్ హెచ్చరించారు. ఎవరి ధర్మాన్ని వారు ఆచరిస్తారు. కానీ ఒకరిని చిన్నగా చేసి చూపించకూడదు. అలా చేయడం మంచిది కాదు. మతం ప్రచార అస్త్రం కాదు.. దేశభక్తి ప్రదర్శన అస్త్రమూ కాదు.. దేశభక్తి మనకే ఎక్కువ ఉందని కేటీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని సమస్యలు తొలగిపోయాయి. ఈ క్రమంలో ప్రతిపక్షాలకు ఏవిూ సమస్యలు కనబడకపోవడంతో.. మతం, కులం పేరిట విధ్వంసక చర్యలకు పాల్పడేందుకు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఇలాంటి చర్యలకు పాల్పడే వారిని అందరూ గుర్తించాలన్నారు. కేసీఆర్ విూద తెలంగాణ ప్రజలకు అపారమైన విశ్వాసం ఉందన్నారు. తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలుపాల్సిన అవసరం ఉందన్నారు. సోషల్ విూడియాలో ఎన్ని విన్యాసాలు చేసినా బీజేపీ ఆటలు సాగవని కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి అండగా ఉండే పార్టీ టీఆర్ఎస్ మాత్రమే అని కేటీఆర్ స్పష్టం చేశారు. కేసీఆర్ నాయకత్వం తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామరక్ష అని తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఎన్నో ఎజెండాలు ఉంటాయి. కానీ కేసీఆర్కు ఉన్నది ఒకే ఎజెండా.. అది తెలంగాణ ప్రజల సంక్షేమమే. ఈ ఆరేళ్లలో ఎక్కడ ఏ ఎన్నిక వచ్చినా.. కేసీఆర్ నాయకత్వానికే జై కొడుతున్నారు. అయినప్పటికీ కొందరు కళ్లు తెరుచుకోవడం లేదు. టీఆర్ఎస్ పార్టీకి తామే ప్రత్యామ్నాయం అని అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ బీజేపీ ప్రచారం చేసింది. ఆ ప్రయత్నం బెడిసికొట్టింది. ఇప్పుడు కూడా అదే ధోరణిని అవలంబిస్తోంది అని కేటీఆర్ అన్నారు. ఆరేండ్లలో కేంద్రానికి పన్నుల రూపంలో తెలంగాణ రూ. 2 లక్షల 72 వేల కోట్లు ఇచ్చిందని తెలిపారు. కేంద్రం మాత్రం ఒక లక్ష 40 వేల 329 కోట్లు మాత్రమే ఇచ్చిందని పేర్కొన్నారు. రాష్ట్రం నుంచి తీసుకోవడమే తప్ప ఢిల్లీ నుంచి
ఏవిూ ఇవ్వడం లేదు. కానీ మాటలేమో మొత్తం తామే ఇస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారు. రాష్ట్ర రైతాంగానికి కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం చేసిందేవిూ లేదు. నోట్ల రద్దుతో ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది. కరోనా వల్ల లాక్డౌన్ విధించడంతో.. ఆర్థిక వ్యవస్థ మరింత కుదేలయింది. ఆర్థిక వ్యవస్థ విషయంలో ప్రపంచం ముందు దేశం తలదించుకునే పరిస్థితి ఏర్పడింది. నల్లధనం తెస్తామని చెప్పి.. నల్ల చట్టాలు తీసుకొచ్చారు. అగ్రికల్చర్ బిల్లులు, విద్యుత్ చట్టాన్ని తీసుకొచ్చి రైతులను చావుదెబ్బ కొట్టే చట్టాలు తీసుకువచ్చారు. రైతులు వద్దు.. కార్పొరేట్లు ముద్దు అన్న చందంగా కేంద్రం వ్యవహరిస్తోందని అన్నారు. బీజేపీకి అన్ని వర్గాలు దూరమవుతున్నాయి. ఒంటెద్దు పోకడలతో మిత్రపక్షాలన్నీ దూరమయ్యాయి. కేసీఆర్ లాంటి బలమైన నాయకుడి కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు అని కేటీఆర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీనివాస యాదవ్, శ్రీనివాస గౌడ్,పార్టీలో చేరిన శ్రీదర్ రెడ్డి పాల్గొన్నారు.