మన స్వయం కృషితోనే రాష్ట్రాభివృద్ధి

– ఏపీ అభివృద్ధికోసం బీజేపీ ఎలాంటి ప్రయత్నం చేయలేదు
– పైగా ఏపీని ఉద్దరించినట్లు మాట్లాడుతున్నారు
– కోల్‌కతా సభతో భాజపా నేతల్లో భయంపట్టుకుంది
– గతంలో కాపులకు 5శాతం రిజర్వేషన్‌కు బీజేపీ ఒప్పుకోలేదు
– అగ్రవర్ణాల రిజర్వేషన్‌లలో 5శాతం కాపులకే
– 25నుంచి ‘పసుపు – కుంకుమ’ సభలు
– ఈవీఎంలపై జాతీయ స్థాయిలో చర్చసాగుతుంది
– 22పార్టీల ప్రతినిధులతో త్వరలో ఈసీని కలుస్తాం
– టెలీకాన్ఫరెన్స్‌ లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
అమరావతి, జనవరి22(జ‌నంసాక్షి) : ఆంధ్రప్రదేశ్‌లో జరిగే అభివృద్ధి తమ స్వయంకృషి ఫలితమేనని, దానిలో కేంద్రం చేసిందేవిూలేదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఎలక్షన్‌ మిషన్‌ – 2019పై పార్టీ నేతలతో ఆయన మంగళవారం టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆంధప్రదేశ్‌ అభివృద్ధి పట్ల కేంద్రం వివక్షతను ప్రదర్శించిందన్నారు. ఏపీ ప్రజల అండతో స్వయంకృషితో మనమే ఏపీని అభివృద్ధిపథంలో నడిపిస్తున్నామని, నాలుగేళ్లలో ఏపీ అభివృద్ధి ఘనత తెదేపాదేనని చంద్రబాబు స్పష్టం చేశారు. ఆంధప్రదేశ్‌కు ఎక్కువ నిధులు ఇచ్చామంటూ కేంద్ర మంత్రి గడ్కరీ చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని సీఎం చెప్పారు. మహారాష్ట్ర, గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌కే ఎక్కువ నిధులు కేటాయించారన్నారు. ఒక్క బుల్లెట్‌ రైలు ప్రాజెక్టుకే రూ.లక్ష కోట్లకుపైగా కేటాయించారని చంద్రబాబు ఆరోపించారు. ఏపీకి ఇచ్చినవన్నీ టోల్‌ పెట్టి వసూలు చేసే రోడ్లేనని.. ఏదో ఏపీని ఉద్ధరించినట్లు భాజపా నేతలు వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. పోలవరం నిర్మాణంలో జాప్యం చేస్తున్నారని, డీపీఆర్‌-2 ఆమోదంలో ఏడాది జాప్యానికి గడ్కరీ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఏ రాష్ట్రానికైనా ప్రధాని మోదీ అంగీకారంతోనే నిధులు కేటాయిస్తున్నారని సీఎం మండిపడ్డారు. ఏపీ అభివృద్ధికి నిధులు ఇవ్వకుండా అడ్డంకిగా నిలుస్తున్న భాజపా, పైగా మా సహకారంతోనే ఏపీ అభివృద్ధి జరుగుతుందని చెప్పుకోవటం సిగ్గుచేటని చంద్రబాబు విమర్శించారు. ఇటీవల కోల్‌కతాలో జరిగిన మహాకూటమి బహిరంగ సభతో భాజపా నేతల్లో భయం పట్టుకుందని చంద్రబాబు అన్నారు. కూటమికి నలుగురు ప్రధానులని అనడం భాజపాలో భయానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. కోల్‌కతా సభతో భాజపా నేతలు బెంబేలెత్తుతున్నారని, అందుకే ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు.
కేబినెట్‌ నిర్ణయాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి …
కేబినెట్‌ భేటీలో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నామని, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఏపీ చంద్రబాబు నాయుడు అన్నారు. గతంలోనే కాపులకు 5శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని అసెంబ్లీ తీర్మానాన్ని పంపామన్నారు. అయితే కేంద్రంలోని బీజేపీ నేతలు అంగీకరించలేదని మండిపడ్డారు. ఈడబ్ల్యూఎస్‌ కోటాలో కాపులకు 5శాతం, ఇతరులకు 5శాతం ఇస్తామని సీఎం మరోసారి స్పష్టం చేశారు. పెన్షన్ల రెట్టింపునకు కేబినెట్‌ ఆమోదం తెలిపిందన్నారు. అగ్రిగోల్డ్‌ బాధితులకు రూ.250కోట్లు ముందస్తు చెల్లింపు ఉంటుందని, మిగిలినవారికి కూడా హైకోర్ట్‌ ఆదేశాల ప్రకారం న్యాయం చేస్తామని తెలిపారు. ఆటోలపై జీవితకాల పన్ను, ట్రాక్టర్లపై తైమ్రాసిక పన్ను ఎత్తివేస్తున్నట్లు చెప్పారు. మంజూరు కాకుండానే ఇల్లు
కట్టుకున్న పేదలకు 60వేల చొప్పున ఇస్తామన్నారు. ఆర్డీవో ద్వారా చుక్కల భూముల సమస్యలు పరిష్కరిస్తామని సీఎం అన్నారు. చేనేత కార్మికులకు ఆరోగ్య బీమా వర్తింపజేస్తామని, ఉద్యోగులకు డీఏ, రూ.50కోట్లతో జగజ్జీవన్‌ రామ్‌ స్మృతి వనం ఏర్పాటు చేయనున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు. కేబినెట్‌ నిర్ణయాలపై ప్రజల్లో విస్తృత ప్రచారం చేయాలని నేతలకు చంద్రబాబు సూచించారు. ఈనెల 25న రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో ‘పసుపు-కుంకుమ’ సభలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అమరావతి, విశాఖ, కడపలో వీటిని ఏర్పాటు చేస్తామని చంద్రబాబు అన్నారు. అదేవిధంగా చుక్కల భూముల సమస్యను పరిష్కరిస్తామని, ఆర్డీవోల ద్వారా పరిష్కరిస్తామని అన్నారు.
ఈవీఎంలపై జాతీయస్థాయిలో చర్చ..
ఈవీఎంలపై అంతర్జాతీయంగా సైబర్‌ నిపుణుల హెచ్చరికల అంశాన్ని నేతల వద్ద చంద్రబాబు ప్రస్తావించారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ.. ఈవీఎంల ట్యాంపరింగ్‌ ఎలా చేయవచ్చో రుజువులు చూపారని, ప్రజాస్వామ్యంలో అనుమానాలకు తావులేదన్నారు. ఓటు ఎవరికి పడిందనే సంశయం ఉండకూడదన్నారు. సంశయాత్మక ప్రజాస్వామ్యం చేటుదాయకమని చెప్పారు. తెదేపా పోరాటం వల్లే వీవీప్యాట్‌ రశీదులు అమల్లోకి తెచ్చారన్నారు. వీవీప్యాట్‌ కూడా 100 శాతం నియోజకవర్గాల్లో అమలు చేయడం లేదని.. దీనిపై జాతీయస్థాయిలో చర్చిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. 22 పార్టీల ప్రతినిధులతో త్వరలోనే ఈసీని కలుస్తామని సీఎం వివరించారు. 120 దేశాల్లో ఈవీఎంలను అమలు చేయడం లేదని.. కేవలం 20దేశాల్లోనే ఈవీఎంల వినియోగం ఉందని చెప్పారు. ఈవీఎంలపట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని, వాటిపై అవగాహన పెంచుకోవాలని చంద్రబాబు నేతలకు సూచించారు.