మరోసారి అధికారంలోకి రామని.. 

చంద్రబాబుకు భయం పట్టుకుంది
– ¬దాను తాకట్టు పెట్టి పోలవరం తెచ్చుకున్నారు
– కేవలం డ్యామ్‌ కు ఒకే గేటు పెట్టి నీళ్లొచ్చినట్లు మాట్లాడుతున్నాడు
– అగ్రిగోల్డ్‌ బాధితులకు వైసీపీ అండగా ఉంటుంది
– వైసీపీ నేత బొత్స సత్యనారాయణ
విశాఖపట్టణం,డిసెంబర్‌29(జ‌నంసాక్షి): 2014 ఎన్నికల్లో పొత్తులతో స్వల్ప ఓట్ల తేడాతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. మళ్లీ ఈసారి అధికారంలోకి వచ్చే పరిస్థితిలేకపోవటంతో భయంపట్టుకుందని, అందుకనే జగన్‌పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నాడని వైసీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేసే విషయంలో ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఎన్నికలు ఇంకా 100 రోజులే ఉండటంతో ఈసారి అధికారంలోకి రాలేమని చంద్రబాబుకు భయం పట్టుకుందని విమర్శించారు. చంద్రబాబు బహిరంగ సభలు, సవిూక్షా సమావేశాల్లో చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే అదే అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌ లో పదేళ్ల పాటు ఉండే అవకాశం ఉన్నప్పటికీ ఓటుకు నోటు వ్యవహారంలో ఇరుక్కుని పారిపోయి వచ్చారని దుయ్యబట్టారు. తెలంగాణ ఎన్నికల సందర్భంగా లగడపాటి రాజగోపాల్‌ ద్వారా ప్రజలను మభ్యపెట్టేందుకు యత్నించారని బొత్స విమర్శించారు. అగ్రిగోల్డ్‌ బాధితులకు వైసీపీ
అండగా ఉంటుందనీ, వారికి న్యాయం జరిగే వరకూ విశ్రమించబోమని స్పష్టం చేశారు. జగన్‌ కోసమే హైకోర్టును విభజించారని చంద్రబాబు చౌకబారు విమర్శలు చేస్తున్నారని తెలిపారు. చంద్రబాబు స్వార్థ రాజకీయాల కోసం పదేళ్ల రాజధానిని ముందుగానే వదులుకోవాల్సి వచ్చిందని అన్నారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం వైఎస్‌ రాజశేఖరరెడ్డి అహర్నిశలు శ్రమించారని గుర్తుచేశారు. ప్రత్యేక¬దాను తాకట్టు పెట్టి చంద్రబాబు పోలవరం కాంట్రాక్టును తీసుకున్నారని ఆరోపించారు. కేవలం డ్యామ్‌ కు ఒకే గేటు పెట్టి నీళ్లు ప్రతీ ఇంటికి వచ్చేసినట్లు, విశాఖ ప్రజలంతా పోలవరం నీటినే తాగుతున్నట్లు చంద్రబాబు బిల్డప్‌ ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి గేట్లు ఇంకా 47పెట్టాల్సి ఉందనీ, ఒక్కో గేటు నిర్మాణానికి 60రోజులు పడుతుందని చెప్పారు.