మలేషియాలో పడవ ప్రమాదం


8మంది మృతి, మరో 20మంది గల్లంతు
కౌలాలంపూర్‌: మలేషియా తీర ప్రాంతంలో ఓ పడవ నీట మునగడంతో 8మంది మృతి చెందగా మరో 20 మంది గల్లంతయ్యారు. మలేషియా దక్షిణ ప్రాంతమైన జోహార్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. అధికారుల వివరణ ప్రకారం.. ఇండొనేషియా నుంచి మలేషియా వెళ్లేందుకు 62మంది ఇండొనేషియన్లు, అక్రమ వలసదారులు ప్రయాణిస్తున్న పడవ మలేషియా తీర ప్రాంతంలో ప్రమాదవశాత్తూ కూలిపోవడంతో ప్రయాణికులంతా నీట మునిగారు. సమాచారం అందుకున్న అధికారులు భద్రతా సిబ్బందితో గాలింపు చర్యలు చేపట్టగా 34మందిని ప్రాణాలతో రక్షించగలిగారు. ఎనిమిది మంది మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. మరో 20మంది ఆచూకీ ఇంకా తెలియడం లేదని, వారికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు వివరించారు. కాపాడిన వారినీ, అక్రమ వలసదారులను తిరిగి వారి దేశానికి తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనిపై పూర్తి విచారణ జరపనున్నట్లు తెలిపారు.