మళ్లీ అమెరికాకు పారికర్‌

– చికిత్స కోసం మరోసారి వెళ్లిన గోవా సీఎం

పనాజీ, ఆగస్టు29(జ‌నం సాక్షి) : గోవా ముఖ్యమంత్రి మనోహర్‌ పారికర్‌ అనారోగ్యంతో ముంబయిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా మెరుగైన వైద్యం కోసం ఆయన మళ్లీ అమెరికాకు వెళ్తున్నారు. బుధవారం రాత్రి ఆయన అమెరికాకు బయలుదేరి వెళ్లినట్లు పారికర్‌ కార్యాయలం వెల్లడించింది. 62ఏళ్ల పారికర్‌ ఇటీవల అమెరికాలో క్లోమ గ్రంథి సంబంధిత సమస్యకు చికిత్స చేయించుకుని తిరిగి వచ్చారు. జూన్‌లో ఆయన భారత్‌కు వచ్చారు. ఈ నెలలో మరోసారి చెకప్‌ కోసం అమెరికా వెళ్లారు.అమెరికా నుంచి తిరిగి వచ్చిన మరుసటి రోజే ఆగస్టు 23న సాధారణ రివ్యూ హెల్త్‌ చెకప్‌ కోసం ముంబయిలోని లీలావతి ఆస్పత్రికి వెళ్లిన పారికర్‌ మళ్లీ ఆస్పత్రిలో చేరారు. చికిత్స అనంతరం ఆయన బుధవారం తిరిగి గోవాకు వెళ్లాల్సి ఉండగా.. మరోసారి చికిత్స కోసం అమెరికాకు వెళ్తున్నారు. ముంబయి నుంచి ఈరోజు రాత్రి పారికర్‌ అమెరికా వెళ్తున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం సీనియర్‌ అధికారి ఒకరు వెల్లడించారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితిపై స్పందించడానికి అధికారులు నిరాకరించారు. పారికర్‌ ముఖ్యమంత్రి బాధ్యతలను ఎవ్వరికీ అప్పగించలేదని తన వద్దే ఉంచుకున్నారని, ఇతరులకు అప్పగించాల్సినంత అవసరం ఏవిూ లేదని తెలిపారు.