మా సవాల్‌కు చంద్రబాబు స్పందించలేదు : హరీశ్‌రావు


హైద్రాబాద్‌, నవంబర్‌11(జనంసాక్షి): తెలంగాణకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చేసిన మోసంపై బహిరంగ చర్చకు సిద్దమని తాము విసిరిన సవాలుకు టీడీపీ నుంచి స్పందన లేదని టీఆర్‌ఎస్‌ శాసనసభ్యుడు హరీష్‌రావు అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తమ సవాలుకు ఎలాంటి స్పందన తెలుపలేదని అన్నారు. టీడీపీ నేతలకు తెలంగాణ అంశంపై బహిరంగంగా చర్చించేందుకు దమ్ములేదని ఎద్దేవా చేశారు. తెలంగాణకు చంద్రబాబు తీరని అన్యాయం చేశాడని, కావాలంటే బహిరంగ చర్చకు ఎక్కడంటే అక్కడ తాము సిద్దమన్నారు. అవసరమైతే టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఈ బహిరంగ చర్చల్లో పాల్గొంటారని అన్నారు. నోరు పారేసుకుంటే టీడీపీ నేతలకు తిప్పలు తప్పవని హెచ్చరించారు. టీడీపీ తప్పులను ప్రజలు మరిచిపోలేరన్నారు. ఎన్నికల్లో ప్రజలు బుద్దిచెప్పినా కడియం శ్రీహరికి జ్ఞానోదయం కాలేదన్నారు. రాజ్యసభ ఎమ్మెల్సీ పదవుల కోసమే తెలంగాణ టీడీపీ నేతలు చంద్రబాబు కాళ్ల ముందు మోకరిల్లుతున్నారని విమర్శించారు.