మూగజీవిపై సామూహిక అత్యాచారం

చండీగఢ్: ఆ మధ్య కోడిని ఒకడు రేప్ చేశాడన్న వార్త గుర్తుంది కదా.. ఇదీ అలాంటిదే. ఈసారి ఓ మేకను 8 మంది కలిసి సామూహిక అత్యాచారం చేశారు. ఈ వింత ఘటన హర్యానాలోని మేవాట్ జిల్లాలో ఉన్న మరోడా గ్రామంలో జరిగింది. అత్యాచారం జరిగిన మరుసటి రోజు ఆ మేక చనిపోయింది. పోలీసులు ఆ ఎనిమంది కోసం గాలిస్తున్నారు. వీళ్లందరికీ గతంలో నేర చరిత్ర ఉంది. అందులో ముగ్గురిని అప్పుడే స్థానికులు పట్టుకొని చితకబాదారు. పోలీసులు వీళ్లపై ఐపీసీ సెక్షన్ 377, యానిమల్ క్రూయల్టీ చట్టాల కింద కేసు నమోదు చేశారు. ఇప్పటివరకు ఎవరినీ అరెస్ట్ చేయకపోయినా.. త్వరలోనే వాళ్లందరినీ పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు.

ఆ మేక యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని, స్థానికులతోనూ మాట్లాడతామని నుహ్ ఎస్పీ నజ్నీన్ భాసిన్ తెలిపారు. బుధవారం రాత్రి నుంచి తన మేక కనిపించకుండా పోయిందని యజమాని అస్లప్ ఖాన్ చెప్పాడు. ఆ రోజు రాత్రే తనతోపాటు స్థానికులు మేక కోసం వెతికారని, ఓ చోట కొందరు వ్యక్తులు తన మేకపై లైంగిక దాడి చేస్తూ కనిపించారని అస్లప్ తెలిపాడు. అందులో ముగ్గురిని పట్టుకొని చితకబాదినా.. తర్వాత అక్కడి నుంచి పారిపోయారని అన్నాడు. వీళ్లందరిపైనా గతంలో కేసులు ఉన్నాయి. చాలాసార్లు జైలుకు కూడా వెళ్లొచ్చారు.