మోదీ అనుకూల కూటమిలో..  టీఆర్‌ఎస్‌, వైసీపీ


– నిరంకుశత్వాన్ని ఎదిరించడం ఎన్టీఆర్‌ నేర్పిందే
– ఇప్పుడు నిరంకుశత్వం బీజేపీ రూపంలో ఉంది
– బీజేపీపై ధర్మపోరాటం చేస్తున్నాం
– ఎన్నికలకు ఇంకా వందరోజులే సమయముంది
– తెదేపా ఘన విజయానికి నేతలు కృషి చేయాలి
– టెలీకాన్ఫరెన్స్‌లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
అమరావతి, జనవరి18(జ‌నంసాక్షి) : దేశంలో రెండే కూటములు ఉన్నాయని, అవి బీజేపీ వ్యతిరేక, అనుకూల కూటమిలని, మోదీ అనుకూల కూటమిలో టీఆర్‌ఎస్‌, వైసీపీ పార్టీలు ఉన్నాయని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. శుక్రవారం అమరావతిలోని తన నివాసంలో పార్టీ నేతలతో చంద్రబాబు వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ.. ఇంకా ఎన్నికలకు వంద రోజులే ఉన్నాయని అన్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించాలని నేతలకు తెలియజేశారు. పార్టీ మనకోసం ఏం చేసింది అనేది కాదని, పార్టీ కోసం మనం ఏం చేయాలని ఆలోచించే సమయం ఇది అని అన్నారు. నిరంకుశత్వాన్ని ఎదిరించడం ఎన్టీఆర్‌ నేర్పిందే అని అన్నారు. ఇప్పుడు నిరంకుశత్వం బీజేపీ రూపంలో… పెత్తందారీతనం నరేంద్ర మోదీ రూపంలో ఉందన్నారు. అందుకే బీజేపీపై ధర్మపోరాటం చేస్తున్నామని చంద్రబాబు చెప్పుకొచ్చారు. శనివారం కోల్‌కతాలో బీజేపీయేతర పార్టీల ర్యాలీకి హాజరవుతున్నట్లు తెలిపారు. టీఆర్‌ఎస్‌, వైసీపీ మినహా అందరూ కోల్‌కతా వస్తున్నారని చంద్రబాబు తెలిపారు. దీన్నిబట్టే ఆ రెండు పార్టీలు ఎక్కడ ఉన్నాయో తెలిసిపోతుందని వ్యాఖ్యానించారు. మోదీ అనుకూల కూటమి, వ్యతిరేక కూటమి .. రెండే ఉన్నాయని స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్‌, వైసీపీ.. మోదీ అనుకూల కూటమిలో ఉన్నట్లే అని పేర్కొన్నారు. అసత్యాలతో దుష్పచ్రారం చేసేందుకే కడపలో బీజేపీ సభ ఏర్పాటు చేసిందని మండిపడ్డారు. తెలంగాణలో 26కులాలను బీసీ జాబితా నుంచి తొలగించి.. ఇక్కడికొచ్చి బీసీల సంక్షేమంపై మాట్లాడుతున్నాని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
నేటి తరానికి ఎన్టీఆర్‌ స్ఫూర్తి ప్రదాత అని చంద్రబాబు అన్నారు. సంక్షేమ పథకాలకు ఆద్యుడు ఎన్టీఆరే అని చెప్పారు. ఆయన ఆదర్శాలకు పునరంకింతం కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకున్నారు. పేదరికంపై గెలుపే ఎన్టీఆర్‌కు నిజమైన నివాళి అని
చెప్పారు. సమాజ సేవలో చురుగ్గా పాల్గొని పేదల సేవకు పునరంకితం కావాలని సూచించారు. పార్టీ
పేదల సంక్షేమాన్ని మూడు విధాలుగా చేస్తున్నామన్నారు. నేరుగా నగదు బదిలీ, విద్య, వైద్య, ఆహారం రూపంలో సంక్షేమం కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ప్రతి కుటుంబం ఆదాయం పెంచడం.. నెలకు కనీసం రూ.10వేల ఆదాయం వచ్చేలా చేస్తామన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టామని చంద్రబాబు చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్‌ఎంఈ పార్కులను అభివృద్ధి చేస్తామన్నారు. ప్రజల ఆదాయం పెరిగి, జీవన ప్రమాణాలు మెరుగుపడాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు.