మోదీ ఇలాఖాలో కాంగ్రెస్‌ హవా

2

– గుజరాత్‌లో భాజాపాకు షాక్‌

– 31 జిల్లా పరిషత్‌లో 21 కాంగ్రెస్‌ కైవసం

అహ్మదాబాద్‌, డిసెంబర్‌ 2 (జనంసాక్షి):

బీహార్‌ ఎన్నికల తరవాత సొంతరాష్ట్రం గుజరాత్‌లోనూ ప్రధాని నరేంద్ర మోదీకి కొంత ఎదురుగాలి వీస్తోంది.  గుజరాత్‌ స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార బీజేపీకి షాక్‌ తగిలింది. గత అసెంబ్లీ, పార్లమెంట్‌, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన బీజేపీకి ఈ సారి ప్రతికూల ఫలితాలు ఎదురయ్యాయి. ప్రధాని మోదీ సొంత జిల్లా మెహ్సనాలో జిల్లా పరిషత్‌, మున్సిపల్‌ కొర్పొరేషన్లను కాంగ్రెస్‌ పార్టీ కైవసం చేసుకుంది. కాగా పట్టణ ప్రాంతాల్లో బీజేపీ తన పట్టును నిలబెట్టుకోగా, గ్రావిూణ ప్రాంతాల్లో కాంగ్రెస్‌ దూసుకెళ్తోంది. ఇక గుజరాత్‌లో వరుస ఓటములతో ఢీలాపడ్డ కాంగ్రెస్‌ స్థానిక సంస్థల ఎన్నికల్లో పుంజుకుంది. ఆ రాష్ట్రంలోని మొత్తం 31 జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో బీజేపీ కంటే కాంగ్రెస్‌ ముందంజలో కొనసాగుతోంది. బుధవారం జరుగుతున్న కౌంటింగ్‌లో గ్లో వెల్లడైన ఫలితాల్లో కాంగ్రెస్‌ ఎక్కువ 21 జిల్లా పరిషత్‌  లను సొంతం చేసుకుంది. మెహ్సనా, తాపి, గాంధీనగర్‌ జిల్లా పరిషత్‌లను గెలుచుకుంది.  ప్రస్తుత ఫలితాలను బట్టి మూడింట రెండొంతుల స్థానాలను కాంగ్రెస్‌ గెలిచే అవకాశముంది. కాగా ఆ రాష్ట్రంలోని మొత్తం ఆరు మున్సిపల్‌ కార్పొరేషన్లను బీజేపీ దక్కించుకుంది. మున్సిపాల్టిల్లోనూ బీజేపీ హవా కొనసాగుతున్నా కొన్ని చోట్ల కాంగ్రెస్‌ పార్టీ నుంచి గట్టి పోటీ ఎదురైంది. రిజర్వేషన్లు కల్పించాలని గుజరాత్లో పటేళ్లు ఆందోళన బాటపట్టడం, అధికార బీజేపీ ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉండటంతో.. గుజరాత్‌ గ్రావిూణ ప్రాంతాల్లో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలిందని విశ్లేషకులు భావిస్తున్నారు.