యాదాద్రిలో ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు

యాదాద్రి భువనగరి,ఆగస్ట్‌15(జ‌నం సాక్షి): యాదగిరిగుట్టలో 72వ స్వాతంత్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. నూతనంగా ఏర్పడిన యాదగిరిగుట్ట మున్సిపాలిటీ కార్యాలయం వద్ద ఆర్డీవో భూపాల్‌ రెడ్డి జాతీయ జెండా ఎగరవేశారు. ప్రభుత్వ కార్యాలయాల వద్ద అధికారులు, వివిధ పార్టీ కార్యాలయాల వద్ద పార్టీ అధ్యక్షులు మువ్వన్నెల పతాకాన్ని ఆవిష్కరించి జెండా వందనం స్వీకరించారు. తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి కొండపైన ఆలయ ఈవో గీతారెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. యాదగిరిగుట్టలో కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం వద్ద మువ్వన్నెల జెండాను ఎగురవేసి జెండా వందనంను స్వీకరించారు. మండల పరిషత్‌ కార్యాలయం వద్ద ఎంపీపీ స్వప్నరవీందర్‌ గౌడ్‌, తహశీల్దార్‌ కార్యాలయం వద్ద ఎమ్మార్వో రామకృష్ణ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి ఇండిపెండెన్స్‌ డే వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. పట్టణంలోని ప్రభుత్వ ప్రైవేట్‌ స్కూల్స్‌, కళాశాలల వద్ద ప్రిన్సిపల్స్‌ మూడు రంగుల జెండాను ఆవిష్కరించి ఇండిపెండెన్స్‌ డే దినోత్సవ సంబరాలను వైభవంగా జరుపుకున్నారు. ఈ వేడుకల్లో యాదగిరిగుట్టలోని విద్యార్థినీ విద్యార్థులు ప్రదర్శించిన స్వాతంత్య సమరయోధుల వేషధారణ స్థానికులను ఆకట్టుకుంది.