యువతిని లోబర్చుకుని అశ్లీల ఫోటోలతో బెదిరింపు
ఫిర్యాదులో యువకుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
న్యూఢిల్లీ,ఆగస్ట్17(జనం సాక్షి ): ఓ యువతిని బలవంతంగా లోబర్చుకుని, ఆపై ఫోటోలు తీసి దాంతో తనను పెళ్లి చేసుకోవాలని బ్లాక్ మెయిల్ చేశాడో యువకుడు. దానికి యువతి నిరాకరించడంతో ఆమె అశ్లీల ఫోటోలను సోషల్ విూడియాలో పోస్టు చేశాడు. ఈ దారుణ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. స్థానిక అమర్ కాలనీకి చెందిన 24 ఏళ్ల యువకుడు గార్మెంట్స్ దుకాణం నడుపుతున్నాడు. అయితే, అతడు తన వద్ద పనిచేసే 17 ఏళ్ల యువతికి 2016 ఏప్రిల్ లో మత్తుమందు కలిపిన పానీయం ఇచ్చి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ సమయంలో యువతి ఫోటోలు తీశాడు. అనంతరం యువతికి ఆమె అశ్లీల ఫోటోలు చూపించి తనను పెళ్లి చేసుకోవాలని బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ సంఘటన జరిగిన సరిగ్గా రెండేళ్ల తర్వాత బాధిత యువతికి మరో యువకుడితో పెళ్లి నిశ్చయమైంది. విషయం తెలుసుకున్న యువకుడు నకిలీ ఫేస్ బుక్ ఖాతా ద్వారా యువతి అశ్లీల ఫోటోలు పోస్టు చేశాడు. వాటిని యువతిని పెళ్లాడాబోతున్న యువకుడితోపాటు వారి తల్లిదండ్రులకు షేర్ చేశాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడైన యువకుడిని అదుపులోకి తీసుకుని విచారించగా రెండేళ్ల క్రితం ఆమెపై అత్యాచారం చేశానని అంగీకరించాడు. దాంతో నిందితుడిపై పోలీసులు బ్లాక్ మెయిలింగ్, పోస్కో చట్టాల కింద కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.