యూపిలో 75 ఎంపి స్థానాలు గెలువబోతున్నాం

ఫలితాల తరవాత ఇవిఎంలపై దుమ్మెత్తి పోయడం ఖాయం
యూపి ప్రచారంలో అమిత్‌ షా ఘాటు విమర్శలు
లక్నో,మే29 (జనంసాక్షి)
ఈ లోక్‌సభ ఎన్నికలు అయోధ్య రామభక్తులకు, వారిపై తూటాలకు దింపిన వారికి మధ్య పోటీగా మారాయని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారదశల్లో అత్యంత జాగ్రత్తగా మాట్లాడాలని ఎన్నికల సంఘం హెచ్చరికలు వెలువరించిన తరువాత హోం మంత్రి ఉత్తరప్రదేశ్‌లో బుధవారం నాటి ఎన్నికల సభలలో ఘాటుగా మాట్లాడారు. ఇవి మామూలు ఎన్నికలు కావని, అయోధ్యలో రామాలయనిర్మాణానికి పాటుపడ్డ వారు ఒక వైపు, వారిపై కాల్పులకు ప్రేరేపించిన వారొక్కరు బరిలో నిలిచారని చెప్పారు. డియోరియాలో బిజెపి అభ్యర్థి శశాంత్‌ మణి త్రిపాఠీ విజయానికి అమిత్‌ షా బిజెపి తరఫున ప్రచారం సాగించారు. విపక్షాలు అయోధ్యలో రామాలయ నిర్మాణానికి 70 ఏండ్ల పాటు అడ్డుగా మారారని తెలిపారు. ప్రధాని మోడీ ప్రమేయంతోనే అయోధ్యలో రామాలయం ఉనికిలోకి వచ్చిందన్నారు. 1990లో ములాయం సింగ్‌ యాదవ్‌ సిఎంగా ఉన్నప్పుడు కరసేవకులపై కాల్పుల విషయాన్ని ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించిన అమిత్‌ షా సమాజ్‌వాది పార్టీ ప్రమాదకరమైనదని తెలిపారు. కాంగ్రెస్‌కు , సమాజ్‌వాది పార్టీ నేతలకు వారిపై వారికే నమ్మకం లేదని , ఎన్నికలలో ఓటమి పాలయినప్పుడల్లా వారు ఇవిఎంలపై నిందలు మోపడం జరుగుతుందని విమర్శించారు. ఇప్పుడు జూన్‌
4వ తేదీన కూడా ఇదే జరుగుందన్నారు. ఆ రోజు ఇద్దరు యువరాజులు రాహుల్‌, అఖిలేష్‌ యాదవ్‌ కూడబలుక్కుని విలేకరుల సమావేశం పెడుతారు. తమ ఓటమికి కారణం ఎవిఎంలే అని మరోసారి నిందిస్తారని, ఆ రోజు జరిగేది ఇదే అని అంతకు ముందు మహారాజ్‌గంజ్‌లో పార్టీ అభ్యర్థి పంకజ్‌ చౌదరి విజయానికి జరిగిన సభలో చమత్కరించారు. ప్రతిపక్షాలకు ప్రధాని అభ్యర్థి లేరని, వారికి ఐదేళ్లలో ఐదుగురు ప్రధానులు ఉంటారని వ్యాఖ్యానించారు. ఇదేమన్నా కిరాణాకొట్టా? 130 కోట్ల మందితో కూడిన దేశం, బహుళ ప్రధానుల పద్ధతి చెల్లనేరుతుందా? వారి పరాజయం తప్పదు, ఇవిఎంలపై నిందలూ తప్పవని స్పష్టం చేశారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో 70 లోక్‌సభ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటుందని అమిత్‌ షా ధీమా వ్యక్తం చేశారు. 2014 నాటి ఎన్నికల రికార్డును తమ పార్టీ బద్దలు కొడతుందని తెలిపారు. ఈ సారి ప్రధాని మోదీని అనుకూల పవనాలు చాలా బలంగా వీస్తున్నాయన్నారు.