రసాభాసాగా విజయవాడ మున్సిపల్‌ కార్పోరేషన్‌ భేటీ

విజయవాడ,జనవరి23(జ‌నంసాక్షి): విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ సమావేశం రసాభాసగా మారింది. 2019-20 బ్జడెట్‌పై సవరణ తీర్మానం చేయాలన్న వైఎస్సార్‌సీపీ, సీపీఎం కార్పొరేటర్ల విజ్ఞప్తిని మేయర్‌ తోసిపుచ్చారు. దీంతో రెండు పార్టీల కార్పొరేటర్లు సమావేశాన్ని వాకౌట్‌ చేసి కౌన్సిల్‌ హాలు ముందు నిరసనకు దిగారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ, సీపీఎంల కార్పొరేటర్లు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వదని తెలిసినా.. రూ.1968కోట్ల బ్జడెట్‌ను ప్రవేశపెట్టడం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూపాయి బిల్ల తేలేని పాలకపక్షం..ఎన్నికల ముందు బ్జడెట్‌ అంకెలను పెంచిందని విమర్శించారు. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లకు డబ్బులు కట్టించుకొని ఇప్పుడు లబ్దిదారులకు సింగిల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను కేటాయించారని మండిపడ్డారు. పేదల ఇళ్లకోసం భవిష్యత్తులో పోరాటం చేస్తామని రెండు పార్టీల కార్పొరేటర్లు పేర్కొన్నారు.