రాజ్‌భవన్‌లో బోనాల సందడి

స్వయంగా బోనమెత్తిన గవర్నర్‌ తమిళసై

హైదరాబాద్‌,జూలై23(ఆర్‌ఎన్‌ఎ): రాజ్‌భవన్‌లోని అమ్మవారి గుడి ప్రాంగణంలో బోనాలు పండుగను ఘనంగా నిర్వహించారు. పండుగలో భాగంగా గవర్నర్‌ తమిళి సై స్వయంగా బోనమెత్తారు. గవర్నర్‌ తన నివాసం నుంచి ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి చేరుకుని అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. బోనాల పండుగలో రాజ్‌ భవన్‌ సిబ్బంది పాల్గొన్నారు. రాజ్‌ భవన్‌లో నివసించే కుటుంబాలతో కలిసి గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ బోనాల పండుగ నిర్వహించుకున్నారు. రాష్ట్ర ప్రజలందరికీ గవర్నర్‌ తమిలిసై సౌందరరాజన్‌ బోనాల శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక బోనాల పండుగ అని చెప్పారు. తెలంగాణలో అన్ని దేవతలకు ప్రత్యేక పూజలు చేస్తారని..ముఖ్యంగా బోనాల పండుగ వెనుక ఎంతో చరిత్ర ఉందన్నారు. అషాడ, శ్రావణ మాసాల్లో బోనాల పండుగను ఎంతో భక్తితో నిర్వహిస్తారన్నారు. ఆషాడ మాసంలో ఎక్కువగా నల్ల పోచమ్మను కొలుస్తారని చెప్పిన గవర్నర్‌..ఈ సంవత్సరం బోనాల పండగ నిర్వహించేందుకు ఒక ప్రత్యేకత ఉందన్నారు. అమ్మవారి దయవల్ల సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని గవర్నర్‌ తమిళసై కోరుకున్నారు. అటు దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నందున ప్రతీ ఒక్కరు బస్టర్‌ డోస్‌ వేసుకోవాలని గవర్నర్‌ తమిళసై సూచించారు. కేంద్ర ప్రభుత్వం ఉచితంగా వ్యాక్సిన్‌ ఇస్తుందని.. నిర్లక్ష్యం చేయవద్దని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయని…ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గవర్నర్‌ సూచించారు.