రాధా టిడిపిలో చేరికకు రంగం సిద్దం

విజయవాడ,జనవరి22(జ‌నంసాక్షి): వైసిపికి రాజీనామా చేసిన వంగవీటి రాధా ఈ నెల 25 న టిడిపిలో చేరనున్నట్లు సమాచారం. టిడిపిలో చేరేందుకు సిద్ధమైన వంగవీటి రాధకు విజయవాడ సెంట్రల్‌ నుంచి అసెంబ్లీ బరిలోకి దిగేందుకు ఎమ్మెల్యే టికెట్‌ ను ఇచ్చే పరిస్థితులు లేవని, ఆయన్ను ఎమ్మెల్సీని చేస్తామని చంద్రబాబు హావిూ ఇచ్చినట్టు తెలుస్తోంది. రాధాను పార్టీలో చేర్చుకునే అంశంపై సిఎం చంద్రబాబు కృష్ణా జిల్లా నేతలతో చర్చించారు. ఎవ్వరూ అభ్యంతరం చెప్పకపోవడంతో.. రాధా చేరికకు లైన్‌ క్లియర్‌ కానుంది. ఇదే సమావేశానికి వచ్చిన తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్‌, రాధాను ఆహ్వానించడంపై అభ్యంతరం తెలిపారు. రాధా వస్తే, తనకు అన్యాయం జరుగుతుందని అవినాష్‌ ఆరోపించగా, అవినాష్‌ రాజకీయ భవిష్యత్తుకు ఎలాంటి ఢోకా లేకుండా చూస్తానని, ఓ యువనేతగా మంచి భవిష్యత్తు ఉంటుందని చంద్రబాబు సర్ది చెప్పినట్టు టిడిపి వర్గాలు వెల్లడించాయి.