రాష్ట్ర సమస్యలను సత్వరం పరిష్కరించాలి
జోనల్ వ్యవస్థపై ప్రత్యేకంగా వినతి
ప్రధాని మోడీతో సిఎం కెసిఆర్ ప్రత్యేకంగా భేటీ
న్యూఢిల్లీ,ఆగస్ట్4(జనం సాక్షి): రాష్ట్ర సమస్యలను సత్వరమే పరిష్కరించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని మోడీని కోరారు. హస్తిన పర్యటనలో ఉన్న కేసిఆర్ శనివారం సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్రమోదీతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన జోనల్ వ్యవస్థకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం సాధించేందుకు సీఎం ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగావివిధ అంశాలపై చర్చించారు. హైకోర్టు విభజన, కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర నిధులు, సచివాలయ నిర్మాణానికి రక్షణశాఖ స్థలం కేటాయింపుపై చర్చించారు. రాష్ట్రంలో కొత్త జోనల్ వ్యవస్థకు ఆమోదం తెలపాల్సిందిగా ప్రధానిని కోరారు. కరీంనగర్లో ట్రిపుల్ ఐటీ, కొత్త జిల్లాల్లో నవోదయ విద్యాలయాల ఏర్పాటు, రిజర్వేషన్ల పెంపునకు రాజ్యాంగ సవరణ, వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి నిధుల విడుదలపై ప్రధానితో సీఎం కేసీఆర్ చర్చించారు. కొత్త జోనళ్లకు ఆమోదం, హైకోర్టు విభజన, కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం సాయం తదితర విషయాలను ప్రధాని మోదీకి దృష్టికి తీసుకెళ్లారు. జోనల్ వ్యవస్థకు కేంద్రం ఆమోదం సాధించే పక్రియను ఢిల్లీలో ఉండి స్వయంగా పర్యవేక్షించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. రెండు,మూడు రోజులపాటు ఢిల్లీలోనే ఉండి, కొత్త జోనల్ వ్యవస్థ అవసరాన్ని మోదీకి వివరించి.. సాధించుకోవాలని సీఎం భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటికీ ఉద్యోగ అవకాశాల్లో స్థానికులకు ప్రాదాన్యం కల్పించేందుకు ప్రస్తుతం ఉన్న జోనల్ వ్యవస్థ అవరోధంగా ఉందని ముఖ్యమంత్రి మొదటి నుంచి భావిస్తున్నారు. జోనల్ వ్యవస్థలో మార్పులకు అత్యంత ప్రాధాన్యమిచ్చారు. స్థానికులకే ఎక్కువ అవకాశాలు వచ్చేలా కొత్త జోనల్ వ్యవస్థకు రూపకల్పన చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నుంచి సత్వర ఆమోదం సాధించి, కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారం నియామకాలు చేపట్టాలని గట్టి నిర్ణయంతో ఉన్నారు. రాష్ట్రంలో 31 జిల్లాలు ఏర్పాటు చేసుకోవడం, స్థానికులకు 95 శాతం రిజర్వేషన్ అమలు చేయడం వల్ల స్థానిక యువకులు ఎక్కువ అవకాశాలు పొందుతారని ఆయన భావించారు. ఇప్పుడు ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వ పెద్దలకు వివరించనున్నారు. ఉద్యోగ అవకాశాల్లో స్థానికులకే ఎక్కువ ప్రయోజనం కలిగించడం కోసం 95 శాతం స్థానిక రిజర్వేషన్లతో తెలంగాణ ప్రభుత్వం కొత్త జోనల్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఈ జోనల్ విధానానికి ఆమోదం తెలపాల్సిందిగా కేంద్రాన్ని కోరింది. కేంద్ర న్యాయ శాఖ, ¬ం శాఖ ఇప్పటికే సానుకూలంగా స్పందించాయి. ఫైల్ను ప్రధాన మంత్రి కార్యాలయానికి పంపాయి. దీంతో ఫైల్ ఆమోదం కోసం తానే స్వయంగా ఢిల్లీకి వెళ్లి పర్యవేక్షించాలని సీఎం నిర్ణయించారు. సిఎం కెసిఆర్ వెంట ఎంపిలు ఉన్నారు.