రూపాయికి శస్త్రచికిత్స చేయాలి

వివిధ అభివృద్ది చెందిన దేశాల సరసన నిలబడే భాగ్యం కలిగిందని సంతోషపడుతున్న వేళ రూపాయితో పోల్చుకుంటే మనం ఎప్పటికీ బలహీనంగానే ఉంటున్నాం. బలహీన దేశాలైన సూడాన్‌ లాంటి దేశాల్లో మాత్రమే మనం బలవంతులం. 72ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవాలు జరుపుకుంటున్న వేళ వెనక్కి తిరిగి చూస్తే మన ఆర్థిక ప్రగతి బలపడిందా లేక బలహీన పడిందా అన్నది రూపాయిని అడిగితే చెబుతుంది. ప్రధానంగా మనం రూపాయిని డాలర్‌తో పోలిస్తేనే మన బలం గురించి తెలుస్తుంది. డాలర్‌ మనకు అందనంతగా ఎదిగి పోతోంది. ఇది డాలర్‌ బలమో లేక మన రూపాయి బలహీనతో కానీ పాలకులు మాత్రం ఘనంగా అభివృద్ది గురించి ఢంకా బజాయిస్తున్నారు. అంతెందుకు నోట్ల రద్దు జరగక ముందు ఉన్న వేయి విలువ ఇప్పుడు కొత్త రెండు వేల నోటుకు లేదంటే నమ్మగలమా? కానీ నమ్మాలి. ఆనాటి వేయి నోటు ఇవాళ్టి రెండువేల నోటు ఒకటే అన్న సంగతి బజారులో అడుగుపెడితే సామాన్యుడే చెబుతాడు. వివిధ సంక్షేమ పథకాల్లో దాదాపు 6 కోట్లమంది లబ్ధిదారులు లేకున్నా ఉన్నట్లు చూపించి ఇన్నాళ్లు ప్రజాధనాన్ని మింగేశారు. మేం వచ్చిన తర్వాత అవినీతి, నల్లధనాన్ని అరికట్టి సుమారు రూ.90వేల కోట్ల ప్రజాధనాన్ని ఆదా చేసి దాన్ని పేదల అభివృద్ధికోసం ఉపయోగిస్తున్నాం. ఇప్పుడు దిల్లీ వీధుల్లో అధికార దళారులు లేకుండా చేశాం. ప్రభుత్వ విధానాలు మార్పిస్తామని చెప్పుకొని తిరిగేవారి దుకాణం మూతపడింది. బంధుప్రీతి లేకుండా చేశాం. అవినీతిపరులపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. దాదాపు 3 లక్షల డొల్లకంపెనీలకు తాళాలు వేసి వాటి డైరెక్టర్లపై చర్యలు మొదలుపెట్టాం. 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు జరిగిన చివరి స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి ప్రధాని మోదీ మాట్లాడుతూ ప్రస్తావించిన అంశాలు ఇవి. ఇంకా తన ప్రభుత్వం సాధించిన విజయాలను, చేపట్టిన సంక్షేమ పథకాలను, సంస్కరణలను వివరించారు. ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రధాన మంత్రి జన్‌ ఆరోగ్య అభియాన్‌ పథకాన్ని, భారత కీర్తి పతాకను గగనపుటంచులకు తీసుకెళ్లే బృహత్తర అంతరిక్ష కార్యక్రమాన్నీ ప్రకటించారు. కశ్మీరు, మహిళలపై నేరాలు సహా ప్రస్తుతం దేశంలో నలుగుతున్న పలు అంశాలను స్పృశించారు. ప్రతి భారతీయుడికి ఇల్లు, విద్యుత్తు, గ్యాస్‌, నీరు, మరుగుదొడ్డి, నైపుణ్యాభి వృద్ధి, వైద్యం, బీమా, అనుసంధానం అన్న మంత్రాన్ని తీసుకొని దేశాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. దళితులు, ఓబీసీలు, మహిళలకు న్యాయం చేయడానికి తమ ప్రభుత్వం కృషి చేసిందన్నారు. నాలుగో పారిశ్రామిక విప్లవం ద్వారా దేశం సరికొత్త అవకాశాలను అందుకొనేలా చేస్తానన్నారు. ఇన్ని చెప్పిన ప్రధాని మోడీ మన రూపాయికి శస్త్రచికిత్స చేసే విషయాన్ని మరచిపోయారు. ఆరోగ్యపథకం అందిస్తున్న వేళ దానికి వచ్చిన బీమారీ గురించి పట్టించుకోలేదు. రూపాయి రోజురోజుకూ చిక్కి శల్యమవుతున్నా ప్రస్తావించలేదు. కాంగ్రెస్‌ పాలనతో విసిగిపోయిన ప్రజలు మోడీ అద్భుతాలు చేసేస్తారన్న భావనతో బిజెపిని గద్దెనెక్కించారు. అయితే, ఈ నాలుగేళ్ల మోడీ పాలనలో రూపాయి విలువ పెరగలేదు సరికదా మరింత దిగజారింది. కనీసం ఆనాటి స్థాయిలో వున్నా కొంత నయం అనుకునే పరిస్థితి ఏర్పడింది. రిజర్వు బ్యాంకు గణాంకాల ప్రకారం నాలుగేళ్ల క్రితం అంటే 2014 ఆగస్టు 14న డాలర్‌కు 61.05 పైసలు కాగా ఈ ఏడాది అదే రోజున రూ.69.76 కు దిగజారింది. ఇదీ మోడీ సాధించిన ఆర్థిక ప్రగతి అనుకోవాల్సిందే. నిజంగా రూపాయికి శస్త్రచికిత్స చేసే కార్యాక్రమాలు కానరావడం లేదు. మనవాల్లను అమెరికా పంపించాలంటేనే భయం వెన్నాడుతోంది. చదువు కునేందుకు వెళ్లే పిల్లలకు రూపాయలను బస్తాల్లో పంపినా అక్కడ పిడికెడు డాలర్లు రావడం లేదని వాపోతున్నారు. డెబ్భయ్యేళ్ల చరిత్రలో ఎన్నడూ లేనంత కనిష్ట స్థాయికి దిగజారిపోయి రూపాయి

విలపిస్తుండగా, నిత్యావసరాల ధరలు పెరిగి, ఆర్థిక వ్యవస్థ కుదేలవుతున్న తీరు ఎక్కడా ప్రధాని మోడీ ప్రసంగంలో కానరాలేదు. 1947లో రూపాయి విలువ డాలర్‌తో సమానం. అంటే ఏడు దశాబ్దాల స్వతంత్ర భారతావనిలో మనం బాగా అభివృద్ది సాధించామని ఈ రకంగా పోల్చుకోవాలేమో. డాలర్‌తో రూపాయి మారకం డెబ్భయ్యో వంతుకు చేరిపోయింది. అమెరికా, టర్కీల మధ్య తలెత్తిన విభేదాల నేపథ్యంలో టర్కీ కరెన్సీ అయిన లిరా ఒడిదుడుకులకు గురికావడంతోనే ఇంతటి పెను మార్పులని ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ కూడా ఆలస్యంగా సెలవిచ్చారు. అంటే ప్రపంచంలో ఏ దేశంలో ఏ ఉపద్రవం వచ్చినా మన రూపాయి తట్టుకుని నిలబడేంత బలంగా లేదు. ఇంతటి బలహీనమైన రూపాయి ఎప్పుడు బలపడుతుందా అన్నదే అనుమానం. సరళీకరణ, ప్రపంచీకరణ విధానాలు వచ్చాక ద్రవ్యమారక రేట్లతో ప్రజా జీవనం తీవ్రంగా ప్రభావితమవుతోంది. ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలకమైన చమురు ధరలకు నిర్ణయాత్మకమవుతోంది. రూపాయి మారకం విలువ పడిపోతోందని 2014 ఎన్నికలకు ముందు మోడీ కాంగ్రెస్‌ను తీవ్రంగా విమర్శిస్తూ వచ్చారు. ఇప్పుడు మోడీ ఆయుష్మాన్‌ భారత్‌ ప్రకటించారు. అయితే రూపాయికి శస్త్రచికిత్స చేయకుండా దీనిని సాధించడం దుస్సాధ్యం. ఇది సాధిస్తే ప్రజలు ఎవరికి వారు ఆర్థికంగా ఎదగలరు. ఎవరి ఆరోగ్యం వారు చూసుకోగలరు. దివంగత ప్రధాని పివి నరసింహారావు మాత్రమే ఇలాంటి దార్శనికతను ప్రదర్శించారు. ఆయన తీసుకున్న సాహసోపేత సంస్కరణలే ఇప్పటికీ మనకు రక్షగా నిలిచాయి. ప్రధాని మోడీ ఇప్పుడు ఈ దిశగా దృష్టి సారించాలి. కఠిన పరిశ్రమ చేయాలి. ఎగుమతులు,దిగుమతులను విశ్లేషించాలి. తాము తీసుకుంటున్న నిర్ణయాలు ఫలితం ఇవ్వడం లేదని గుర్తించి అందుకు కారణాలు విశ్లేషించాలి. అప్పుడే మోడీ కలలు సాకారం కాగలవు.