రెండో రోజూ అదే తీరు

పార్లమెంట్‌లో జై తెలంగాణ
వేర్వేరు అంశాలపై చర్చకు విపక్షాల పట్టు
తెలంగాణ బిల్లుకోసం టీ ఎంపీల ఆందోళన
ఉభయ సభలు వాయిదా
న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 23 (జనంసాక్షి):
రెండోరోజూ అదే ప్రతిష్టంభన.. పార్లమెంట్‌ దద్దరిల్లింది. విపక్షాల నిరసనలతో ¬రెత్తింది. 2జీ కుంభకోణం, కోల్‌గేట్‌, ఢిల్లీలో ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారంతో పాటు తెలంగాణ నినాదాలతో అట్టుడికింది. ఆయా అంశాలపై చర్చకు ప్రతిపక్షా లు పట్టుబట్టాయి. బొగ్గు గనుల కుంభకోణానికి బాధ్యత వహిస్తూ ప్రధానమంత్రి తక్షణమే వైదొలగాలని బీజేపీ ఉభయ సభలను స్తంభిం పజేసింది. దీంతో లోక్‌సభ, రాజ్యసభ పలుమార్లు వాయిదా పడ్డాయి. పార్లమెంట్‌లో ప్రతిష్టంభన కొనసాగుతున్న తరుణంలో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ ప్రధానితో సమావేశమై విపక్షాల ఆందోళనలపై చర్చించారు. మరోవైపు, ప్రధాని వైదొలగాలన్న విపక్షాల డిమాండ్‌ను ప్రభుత్వం తోసిపుచ్చింది.మంగళవారం ఉదయం లోక్‌సభ ప్రారంభం కాగానే.. కోల్‌గేట్‌ అంశంపై ప్రధాని మన్మోహన్‌సింగ్‌ రాజీనామా చేయాలని బీజేపీ సభలో ఆందోళనకు దిగింది. మిగతా పార్టీలు ఇతర అంశాలను లేవనెత్తాయి. బొగ్గు గనుల కేటాయిం పులో ప్రధాని రాజీనామా చేయాలని బీజేపీ, బెంగాల్‌పై కేంద్ర నిర్లక్ష్యంపై తృణమూల్‌ కాంగ్రెస్‌, సరిహద్దు భద్రతపై సమాజ్‌వాదీ పార్టీ ఎంపీలు, లడక్‌ అంశంపై చర్చించాలంటూ వామపక్ష పార్టీల సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరోవైపు, తెలంగాణ ఏర్పాటు చేయాలని టీ-కాంగ్రెస్‌ ఎంపీలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. వారికి టీడీపీ ఎంపీ రమేశ్‌ రాథోడ్‌ జత కలిశారు. ప్రధాని రాజీనామా చేయాలి.. తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలన్న నినాదాలు ¬రెత్తాయి. బెంగాల్‌కు నిధులిచ్చేందుకు కేంద్రం నిర్లక్ష్యం వహిస్తోందని తృణమూల్‌ సభ్యులు ప్లకార్డులు ప్రదర్శించారు. వారి నినాదాల మధ్యే స్పీకర్‌ విూరాకుమార్‌ పంచాయతీరాజ్‌ దినోత్సవానికి సంబంధించి ఓ ప్రకటన చేశారు. సభ సజావుగా సాగించేందుకు ఆమె చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో సభను గంట పాటు వాయిదా వేశారు.తిరిగి సభ ప్రారంభమైన అనంతరం కూడా అదే సీన్‌ పునరావృతమైంది. ప్రధాన ప్రతిపక్షం బీజేపీ సభను స్తంభింపజేసింది. ప్రధాని వైదొలగాల్సిందేనని పట్టుబట్టింది. వెల్‌లోకి దూసుకెళ్లి సభా కార్యకలాపాలను అడ్డుకున్నారు. తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు కూడా తమ ఆందోళనను కొనసాగించారు. ఇతర పక్షాలు కూడా వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేయడంతో సభలో గందరగోళం నెలకొంది. ఎంతగా విజ్ఞప్తి చేసినప్పటికీ విపక్షాలు వెనక్కు తగ్గకపోవడంతో స్పీకర్‌ సభను ఈ నెల 25వ తేదీకి వాయిదా వేశారు.అటు రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కోల్‌గేట్‌ అంశంపై బీజేపీ సభను స్తంభింపజేసింది. ప్రధాని రాజీనామా చేయాల్సిందేనని పట్టుబట్టింది. బొగ్గు గనుల కుంభకోణంపై సీబీఐ నివేదికను న్యాయ శాఖ మంత్రి ప్రభావితం చేశారన్న ఆరోపణలపై మన్మోహన్‌ తప్పుకోవాల్సిందేనని డిమాండ్‌ చేసింది. తక్షణమే న్యాయశాఖ మంత్రిని తొలగించాలని నినాదాలు చేసింది. ప్రశ్నోత్తరాలు రద్దు చేసి, బొగ్గు స్కాంపై చర్చకు పట్టుబట్టింది. కుంభకోణాల నుంచి తప్పించుకొనేందుకు ప్రధాని యత్నిస్తున్నారంటూ బీజేపీ ఎంపీలు వెల్‌లోకి దూసుకెళ్లారు. మరోవైపు తృణమూల్‌ కాంగ్రెస్‌ నేతలు తమ స్థానాల్లోంచి లేచి ప్లకార్డులు ప్రదర్శించారు. మిగతా పక్షాలు కూడా ఆందోళన చేపట్టడంతో సభలో గందరగోళం నెలకొంది. ప్లకార్డులు ప్రదర్శించొద్దని చైర్మన్‌ హవిూద్‌ అన్సారీ సూచించినా సభ్యులు వెనక్కుతగ్గలేదు. విపక్షాల నినాదాలతో సభ మార్మోగడంతో గంట పాటు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన అనంతరం కూడా ప్రతిపక్షాలు వెనక్కు తగ్గలేదు. 2జీ, బొగ్గు కుంభకోణం వ్యవహారాలపై విపక్షాలు ఆందోళనకు దిగాయి. దీంతో సభ మళ్లీ రెండు గంటల వరకు వాయిదా పడింది.
ప్రధానితో సోనియా భేటీ
ఊహించని రీతిలో విపక్షాల దాడి తీవ్రవతరమవడంతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ అండగా నిలబడ్డారు. ప్రధాని వైదొలగాలన్న విపక్షాల డిమాండ్‌ను ఆమె తోసిపుచ్చారు. పార్లమెంట్‌లో ప్రభుత్వంపై విపక్షాల దాడి నేపథ్యంలో సోనియా నేతృత్వంలో కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ సమావేశమైంది. పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. విపక్షాలపై ఎదురుదాడికి దిగాలని నిర్ణయించారు. ప్రధాని రాజీనామా చేయాలన్న బీజేపీ డిమాండ్‌ను సోనియా తోసిపుచ్చినట్లు తెలిసింది. విపక్షాలు ఏమైనా డిమాండ్‌ చేస్తాయని, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నట్లు సమాచారం.

తాజావార్తలు