రేపు కలెక్టర్లతో కీలక అంశాలపై సమావేశం కానున్నా ముఖ్యమంత్రి

హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రేపు కలెక్టర్లతో సమావేశం కానున్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక జిల్లా కలెక్టర్లతో ఆయన మొదటి సమావేశంలో ఆయన పలు కీలక అంశాలపై లోతుగా చర్చించనున్నారు. గురువారం సచివాలయం ఏడో అంతస్తు పశ్చిమ భాగంలోని ప్రత్యేక సమావేశ మందిరంలో ఈ సమావేశం జరుగనుంది.సుదీర్ఘంగా జరగనున్న ఈ సమావేశంలో పరిపాలనాపరమైన అంశాలు, కీలక సమస్యలతోపాటు ధరణి పోర్టల్‌కు సంబంధించిన సాంకేతిక, క్షేత్రస్థాయి సమస్యలు, అపరిష్కృతంగా ఉన్న భూసమస్యలు, ఆరు గ్యారంటీలపై చర్చించనున్నారు. ఆదాయ వనరులు తదితర అంశాలూ చర్చకు వచ్చే అవకాశాలున్నట్లు సమాచారం.సదస్సు ఎజెండాను ప్రభుత్వం ఖరారు చేసింది. జిల్లా కలెక్టర్లు పూర్తిస్థాయి సమాచారంతో సమావేశానికి హాజరు కావాలని రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి నవీన్‌ మిత్తల్‌ మంగళవారం కలెక్టర్లకు సమాచారం ఇచ్చారు.