రైతులకు ట్రాక్టర్ల పంపిణీ

ఒంగోలు,నవంబర్‌24(జ‌నంసాక్షి): రైతు రథం పథకం కింద మంజూరైన ఆరు ట్రాక్టర్లను ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసరెడ్డి రామ్‌నగర్‌లోని ఆయన కార్యాలయంలో లబ్దిదారులకు శనివారం ఉదయం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు పండించే పంటకు గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై ట్రాక్టర్లను అందజేస్తున్నట్లు తెలిపారు. గత రెండేళ్లుగా జిల్లాలో సుమారు 15వందల మంది రైతులకు రూ.1.5 లక్షల సబ్సిడీ పై వీటిని అందజేశామన్నారు. కార్యక్రమంలో డీసీఎంఎస్‌ ఛైర్మన్‌ బెల్లం సత్యనారయణ, సూపర్‌ బజారు త్రిసభ్య కమిటీ ఛైర్మన్‌ తాత ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.