రైతులను ఆదుకున్న ఘనత మాదే: జలగం

భద్రాద్రి కొత్తగూడెం,అక్టోబర్‌11 (జ‌నంసాక్షి):  రైతులకు కావాల్సిన ఉచిత విద్యుత్‌ సౌకర్యం కల్పించి, సాగునీటి ఢోకా లేకుండా చేసిన ఘనత సిఎం కెసిఆర్‌దని కొత్తగూడెం నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే జలగం వెంకటరావు అన్నారు. రైతులకు తెలంగాణలో అత్యధిక ప్రాధాన్యం ఇచ్చి వారి సంక్షేమానికి పాటుపడ్డది కెసిఆర్‌ మాత్రమేనని అన్నారు. ప్రతి పల్లెలో మట్టి రోడ్డు లేకుండా సీసీ రోడ్లను నిర్మించామన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజలు అడక ముందే అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిందన్నారు. రానున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీని ఆదరించి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కొత్తగూడెంలో తాను చేసిన అభివృద్ధిని చూసి తనకే ఓటు వేయండంటూ కోరారు.  ఇంటింటి ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడుతున్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో పల్లెలన్నీ అభివృద్ధి చెందాయన్నారు. . కేవలం రైతులకే కాకుండా మత్స్యకారులకు కూడా  చెరువులు ఉపయోగపడుతున్నాయని అన్నారు.  గ్రామస్తులు తెలిపిన చిన్నచిన్న సమస్యలను సావధానంగా విని త్వరలోనే పరిష్కరిస్తానని హావిూ ఇచ్చారు. ఇంటింటి ప్రచారంలో భాగంగా మారుమూల ఉన్న గ్రామాలన్ని కూడా వదలకుండా తిరుగుతున్నారు.  అంతేకాకుండా ఎన్నో ఏళ్లుగా ఇక్కడున్న రైతుల సమస్యను బోరుబావులకు, వ్యవసాయ మోటార్లకు కరెంటు సౌకర్యం కల్పించామన్నారు. అలాగే పోడు భూములకు కూడా పట్టాలు ఇప్పించిన ఘనత టీఆర్‌ఎస్‌ పార్టీకే ఉందని అన్నారు. పట్టాలతో పాటుగా ముందస్తు పెట్టుబడి కింద ఏకరానికి రూ.8 వేలు పెట్టుబడి అందిస్తున్నామని పేర్కొన్నారు.