రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి


– ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టిన కారు
– ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి
గుంటూరు, నవంబర్‌24(జ‌నంసాక్షి) : శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళ్లి తిరిగొస్తూ ముగ్గురు తెలుగు భక్తులు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. గుంటూరు జిల్లా చిలకలూరుపేట సవిూపంలోని 16వ నంబరు జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో రాజమండ్రికి చెందిన ముగ్గురు మృతిచెందారు. ఇదే ఘటనలో మరో భక్తుడు తీవ్రంగా గాయపడ్డాడు. శబరిమల నుంచి రాజమహేంద్రవరానికి కారులో వస్తుండగా వీరు ప్రయాణిస్తోన్న వాహనం ముందు వెళుతున్న లారీని ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మృతిచెందిన వారిని రాజమండ్రికి చెందిన దినేశ్‌ కుమార్‌(31), సారథి(26), సుబ్బారావు(35)లుగా గుర్తించారు. ఇమ్మంది సోమశేఖర్‌ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడటంతో ఆయనను చికిత్స కోసం ఒంగోలు రిమ్స్‌కి తరలించారు. ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. చిలకలూరిపేట రూరల్‌ సీఐ విజయ్‌చంద్ర తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని, కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటకు తీశారు. మృతదేహాలను పోస్ట్‌మార్టమ్‌ కోసం చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విపరీతంగా కురుస్తున్న మంచుతో పాటు అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.