లంచం తీసుకుంటూ ఎసిబికి చిక్కిన పోలీసు అధికారి

ఏలూరు, జనవరి18(జ‌నంసాక్షి) : ఎసిబికి మరో అవినీతి పోలీసు అధికారి చిక్కాడు. దేవరపల్లి పోలీసు స్టేషన్‌ ఎఎస్‌ఐ పల్లి సత్యనారాయణ శుక్రవారం రూ.5 వేలు లంచం తీసుకొంటూ ఎసిబి కి చిక్కాడు. మండలంలోని దుద్దుకూరు గ్రామానికి చెందిన మడతల నాగమణి అనే మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎసిబి అధికారులు పట్టుకున్నారు. వివరాల్లోకెళితే… దేవరపల్లి పోలీస్‌ స్టేషన్‌ లో పెండింగ్‌ ట్రైల్‌ లో మడతల నాగమణి కూతురికి సంబంధించిన కేసు ఉంది. ఆ కేసుకు సంబంధించిన ముద్దాయిలు తన కూతుర్ని మానసికంగా, శారీరకంగా ఏడిపిస్తున్నారని నాగమణి పోలీసుల వద్దకు వచ్చి వాపోయింది. అందుకు ఎఎస్‌ఐ పల్లి సత్యనారాయణ డబ్బులు ఇస్తేనే రిపోర్ట్‌ ను చూస్తానని చెప్పాడు. నాగమణి తన వద్ద ఉన్న రూ.4 వేలు ఇచ్చింది. మరొక రూ.5 వేలు కావాలని ఎఎస్‌ఐ డిమాండ్‌ చేశాడు. గత్యంతరం లేని పరిస్థితిలో నాగమణి ఎసిబి అధికారులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. ఈ రోజు దేవరపల్లి పోలీస్‌ స్టేషన్‌ లో నాగమణి ఎఎస్‌ఐ కు డబ్బులు అందజేస్తుండగా.. ఎసిబి అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌ గా పట్టుకున్నారు. ఈ దాడిలో ఎసిబి డిఎస్పీ గోపాలకఅష్ణ, సిఐ శ్రీనివాస్‌, సిబ్బంది పాల్గన్నారు.