లోక్‌సభ బరిలో వైఎస్‌ షర్మిళ?

– విశాఖ లేదా అనంతపురం స్థానం బరిలోకి

– పార్టీ శ్రేణుల్లో సాగుతున్న చర్చ

అమరావతి, జనవరి19(జ‌నంసాక్షి) : ఏపీ రాజకీయాల్లో వైఎస్సార్‌ కుమార్తె, వైఎస్‌ జగన్‌ సోదరి షర్మిళ హాట్‌టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. తనకు సినీ హీరో ప్రభాస్‌తో సంబంధం ఉందంటూ

సోషల్‌విూడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాన్ని ఆమె బయటకు వచ్చి ఖండించారు. వదంతులు వ్యాప్తి చేసేవారిపై కఠినచర్యలు తీసుకోవాలని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ పుకార్ల వెనుక తెలుగుదేశం పార్టీ ఉందని ఆమె బహిరంగంగానే ఆరోపణలు చేశారు. దీంతో ఏపీ రాజకీయాల్లో హీట్‌ మరింత పెరిగింది. ఇదిలా ఉంచితే.. షర్మిళకు సంబంధించి మరో వార్త ఇప్పుడు రాష్ట్రంలో హాట్‌ టాపిక్‌గా మారింది. షర్మిళ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బరిలో దిగనున్నట్లు తెలుస్తోంది. ఆమె విశాఖ నుంచి పోటీ చేయనున్నట్లు సమాచారం. గత ఎన్నికల్లో విశాఖపట్నం నుంచి పోటీ చేసిన జగన్‌ తల్లి విజయమ్మ.. బీజేపీ-టీడీపీ ఉమ్మడి అభ్యర్థి కంభంపాటి హరిబాబు చేతిలో ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ సారి ఆమె పోటీ చేసేందుకు ఆసక్తి చూపించకపోవడంతో ఆస్థానంలో షర్మిళను పోటీ చేయించాలని వైసీపీ నేతలు జగన్‌ను కోరుతున్నారట. ప్రస్తుత ఎంపీ హరిబాబు ఈసారి గెలిచే అవకాశాలు లేవని, దీన్ని అందిపుచ్చుకుని సాగర నగరంలో వైసీపీ జెండా ఎగురవేయాలని నేతలు పార్టీ అధినేతను కోరుతున్నారట. మరోవైపు షర్మిళ అనంతపురం నుంచి పోటీ చేయనున్నారని మరో వార్త వినిపిస్తోంది. అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ఇటీవల జగన్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయనకు చెక్‌ పెట్టాలంటే షర్మిళను అక్కడి నుంచి బరిలో దించాలని జగన్‌ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అనంతపురంలో జేసీపై తీవ్ర వ్యతిరేకత ఉందని.. ఇది కూడా షర్మిళ విజయానికి సాయపడుతుందని వైసీపీ నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు పార్లమెంట్‌ స్థానాల్లో ఏదో ఒకదారిలో షర్మిళ పోటీ ఖాయమని పార్టీ నేతలు భావిస్తున్నారు. ఎన్నికల సమయానికి జగన్‌ ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే.