ల్యాప్‌టాప్స్‌, ఎలక్ట్రానిక్స్‌ దిగుమతులపై ఆంక్షలు లేవు

` కేంద్రం నిర్ణయం న్యూఢల్లీి(జనంసాక్షి):దేశీయంగా ఎలక్ట్రానిక్స్‌ తయారీని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, ఈ వర్గానికి చెందిన మెషిన్ల దిగుమతిపై ఆంక్షలు విధిస్తున్నట్లు ఈ ఆగస్టులో ప్రకటించింది. అయితే ప్రస్తుతానికి ల్యాప్‌టాప్‌ల దిగుమతులపై ఎటువంటి ఆంక్షలు విధించకూడదని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మునుపటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.ల్యాప్‌టాప్స్‌ దిగుమతిదారులపై ప్రభుత్వం నిఘా ఉంచాలని కోరుకుంటోందని, అంతేకానీ ఎలాంటి నిషేధాలు విధించడం లేదని వాణిజ్య కార్యదర్శి సునీల్‌ బర్త్వాల్‌ తెలిపారు. ఈ విషయంపై ప్రభుత్వం పరిశ్రమతో సంప్రదింపులు జరుపుతోందని, అక్టోబర్‌ చివరి నాటికి ల్యాప్‌టాప్‌ దిగుమతులపై కొత్త విధానాన్ని కేంద్రం ప్రకటిస్తుందని నివేదికలు చెబుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం మేడ్‌ ఇన్‌ ఇండియా పాలసీని ప్రోత్సహిస్తోంది. భారతదేశంలోనే వివిధ రకాల ప్రొడక్ట్స్‌ తయారు చేసేలా బిజినెస్‌ ఇండస్ట్రీలకు ప్రోత్సాహకాలు ఇస్తోంది. ఫలితంగా స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్లు తమ ఉత్పత్తులను దేశంలో తయారు చేయడంతో పాటు అసెంబుల్‌ చేయడం ప్రారంభించాయి. ఇప్పుడు భారత్‌ నుంచి ఇతర దేశాలకు ఫోన్లు ఎగుమతి అవుతున్నాయి. చిప్‌మేకర్లు, సెమీకండక్టర్‌ తయారీ కంపెనీలు కూడా భారతదేశంలో తయారీ యూనిట్లు నెలకొల్పేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో సర్వర్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్‌లు, పర్సనల్‌ కంప్యూటర్ల దిగుమతిపై కేంద్ర ప్రభుత్వం ఆగస్టులో ఆంక్షలు విధించింది. పేర్కొన్న వస్తువులు భారత్‌కు ఇంపోర్ట్‌ చేయడానికి లైన్సెన్స్‌ తీసుకోవాలని డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ (  విడుదల చేసిన ఒక ప్రకటన పేర్కొంది. వినియోగానికి తీసుకొచ్చే ఉత్పత్తులను పరిమితుల నుంచి మినహాయించామని ప్రకటించింది. ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, పర్సనల్‌ కంప్యూటర్లు వంటి ఎలక్ట్రానిక్స్‌ దిగుమతుల విలువ ఈ ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు మొత్తం %వి%19.7 బిలియన్లుగా నమోదైంది. గత సంవత్సరం ఇదే సమయంతో పోలిస్తే దిగుమతులు 6.25% పెరిగాయి. మొత్తం సరుకుల దిగుమతుల్లో ఎలక్ట్రానిక్స్‌ వాటా 7% నుంచి 10% వరకు ఉంది. ఈ నేపథ్యంలో ఈ వస్తువులను దేశీయంగా ఉత్పత్తి చేయాలని భారత్‌ చూస్తోంది. అందుకే ఎలక్ట్రానిక్స్‌ దిగుమతులపై పరిమితులు విధించింది. మన దేశంలో అమ్మడానికి, రీసేల్‌ చేయడానికి విదేశాల నుంచి తీసుకొచ్చే ఎలక్ట్రానిక్స్‌పై ఆంక్షలు ఉంటాయని, వ్యక్తిగత వినియోగానికి ఇతర దేశాల నుంచి కొనుగోలు చేసిన ప్రొడక్ట్స్‌పై పరిమితులు ఉండవని డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ స్పష్టం చేసింది. బ్యాగేజీ నిబంధనల ప్రకారం చేసుకునే దిగుమతులు కూడా ఈ పరిమితుల పరిధిలోకి రావని నోటిఫికేషన్‌ తెలిపింది.అయితే ఈ నిర్ణయంపై పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో వాణిజ్య శాఖ కార్యదర్శి నుంచి తాజా ప్రకటన వచ్చింది. ఎలక్ట్రానిక్స్‌ దిగుమతికి లైసెన్స్‌ ఉండాలనే ఆంక్షలు లేవని, పరిశీలన మాత్రం కొనసాగుతుందని సునీల్‌ బర్త్వాల్‌ తెలిపారు. ఈ మేరకు కొత్త ఇంపోర్ట్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ను నవంబర్‌ 1 నుంచి తీసుకొస్తామని డీజీఎఫ్‌టీ సంతోష్‌ కుమార్‌ సారంగి స్పష్టం చేశారు.