వచ్చే ఐదేళ్లలో భారీగా పెట్టుబడులు
మేకిన్ ఎపి కార్యక్రమంలో లోకేశ్
విజయవాడ,నవంబర్21(జనంసాక్షి): ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని ఉండవల్లిలో ప్రజావేదిక వద్ద ఏపీ ఇన్నొవేషన్ వ్యాలీ ఆధ్వర్యంలో బుధవారం మేకిన్ ఏపీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఐదేళ్ళల్లో రూ.8 వేల కోట్ల టర్నోవర్ ఉన్న పది సంస్థలను రాష్ట్రానికి వచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. రానున్న ఐదేళ్లలో 10 వేల స్టార్టప్లు రాష్ట్రంలో ఏర్పాటు చేయటమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. స్టార్టప్ ప్రమోషన్ కోసం ప్రతి జిల్లాకు రూ.10 కోట్లు చొప్పున కేటాయిస్తున్నామన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. యువత చేతుల్లోనే దేశ భవిష్యత్తు ఉందన్నారు. ఈ సందర్భంగా మేకిన్ ఏపీ కార్యక్రమంలో భాగంగా రెండు ఒప్పందాలు కదిరినట్లు ఆయన వెల్లడించారు.