వాసాలమర్రి నుంచే దళితపథకం అమలు: ఎర్రోళ్ల

హైదరాబాద్‌,ఆగస్ట్‌5( జనంసాక్షి): వాసాలమర్రి గ్రామంలోని 76 మంది దళిత కుటుంబాలకు దళిత బంధు పథకం అమలు చేయడం పట్ల ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ మాజీ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ హర్షం వ్యక్తం చేశారు. సిఎం కెసిఆర్‌ స్పందనకు ఇది నిదర్శనమని అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎర్రోళ్ల శ్రీనివాస్‌ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. దళిత బంధును సీఎం కేసీఆర్‌ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తారనడానికి వాసాలమర్రి గ్రామ దళితులే నిదర్శనమని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ ఆసరా పెన్షన్‌తో ఆపద్బాంధవుడు అయ్యారు. రైతుబంధుతో రైతన్నల గుండెల్లో గూడు కట్టుకున్నాడు. దళిత బంధుతో దళితజాతిలో వెలుగులు నింపాడు అని కొనియాడారు. దళిత జాతి పక్షాన మరోసారి సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నానని ఎర్రోళ్ల శ్రీనివాస్‌ పేర్కొన్నారు.