విద్యార్థులపై ఎబివిపి దాడి చేసింది

ఎన్నికల ఫలితాలపై అధ్యక్షుడు సాయిబాలాజి వెల్లడి

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌17(జ‌నంసాక్షి): జెఎన్‌యుఎస్‌యు ఎన్నికల ఫలితాల అనంతరం జెఎన్‌యు వద్ద ఎబివిపి, వామపక్షానికి చెందిన పలు విద్యార్థిసంఘాలకు మధ్య ఘర్షణ జరిగినట్లు తెలిపారు. ఆదివారం

రాత్రి సట్లెజ్‌ హాస్టల్‌లో సమావేశానికి పిలిచామని, ఆ సమయంలో ఎబివిపికి చెందిన విద్యార్థులు వారిపై దాడి చేశారని నూతనంగా ఎన్నికైన జెఎన్‌యుఎస్‌యు అధ్యక్షుడు సాయిబాలాజి వెల్లడించారు. అనంతరం తాను ఆప్రదేశానికి వెళ్లానని, అక్కడ భయానక పరిస్థితులు నెలకొని ఉన్నాయని, సౌరబ్‌శర్మ అనే విద్యార్థిని రక్తం వచ్చేటట్లు కొట్టారని, ఎబివిపి విద్యార్థులు కర్రలతో విచక్షణా రహితంగా కొట్టారని ఆయన పేర్కొన్నారు. మాజీ జెఎన్‌యుఎస్‌యు అధ్యక్షురాలు గీతా కుమారి కూడా అక్కడే ఉన్నారని దాడిలో జోక్యం చేసుకుంటే భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించినట్లు ఆయన తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి వసంత్‌ కుంజ్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లామని ఆయన పేర్కొన్నారు.