విమర్శించే వారు పాటించి చూపాలి

కాంగ్రెస్‌, బిజెపిలకు కడియం చురకలు
వరంగల్‌,మే11(జ‌నం సాక్షి): రైతుబందు పథకాన్ని విమర్శిస్తున్న వారు రైతులను అవహేళన చేస్తున్నారని డిప్యూటి సిఎం కడియం శ్రీహరి అన్నారు. ఇతర రాష్ట్రాలలో పాలిస్తున్న కాంగ్రెస్‌, బిజెపిలు ఇలాంటి పథకాలను ఎందుకు అక్కడ ప్రవేశపెట్టడం లేదో తెలపాలని శ్రీహరి ప్రశ్నించారు.  రాష్ట్రంలోని రైతులు వ్యవసాయాన్ని పండుగలా చేసేందుకు ఏ దేశంలో, ఏ రాష్ట్రంలోని లేని విప్లవత్మాకమైన పథకాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారంభించారని మంత్రి అన్నారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథకాన్ని  కాంగ్రెస్‌,బిజెపి పాలిత రాష్ట్రాల్లో ప్రారంభించాలన్నారు. రైతులపై ప్రేమ ఒలకబోస్తున్నవారు చేసి చూపాలన్నారు. గత పాలకుల హయాంలో వ్యవసాయం దండుగ అన్న రైతులు నేడు వ్యవసాయం పండుగ అనేలా చేసిన సీఎం కేసీఆర్‌కు ప్రతిఒక్క రైతు రుణపడి ఉంటారని అన్నారు. కవిూషన్లకు కక్కుర్తి పడి, ఒక ఎకరానికి కూడా నీరు ఇవ్వకుండా లక్ష కోట్లు ఖర్చుపెట్టిన చరిత్ర కాంగ్రెస్‌దే అని విమర్శించారు. రాష్ట్రంలో ని అన్ని వర్గాలకు అన్నిరకాల పథకాలు అమలు చేస్తున్న ఏకైక సిఎం కేసిఆర్‌ అన్నారు. పేదింట్లో ఆడపిల్ల పుట్టిందంటే, ఆ పిల్ల పెళ్లీడుకు వచ్చిదంటే తల్లిదండ్రులకు భయం. ఆ పిల్ల పెళ్లి చేయడానికి వారు పడే అవస్థలు స్వయంగా చూసిన వ్యక్తిని తానేనని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. నాకు ఆరుగురు అక్కాచెల్లెల్లున్నారని, వారి పెళ్లిల్లు చేయడానికి నా తల్లిదండ్రులు పడ్డ అవస్థ చూశానని చెప్పారు. అయితే పేదింటి కష్టాలు తెలిసిన వ్యక్తి సిఎం కేసిఆర్‌ ఆడపిల్ల పెళ్లికి మేనమామలాగా మొదట్లో
51వేలు, తర్వాత సరిపోదని 75వేలు, ఇప్పుడు ఇంకా పెంచి లక్షా 116 రూపాయలు ఇస్తున్న గొప్ప సిఎం అని కొనియాడారు. అదేవిధంగా పేదింట్లో గర్భిణీ అయిన తర్వాత కూడా ప్రసవం వరకు పనిచేయకపోతే గడవని పరిస్థితిని గమనించిన సిఎం కేసిఆర్‌ గర్భిణీ స్త్రీలకు గర్భం దాల్చిన మూడు నెలలు, ప్రసవం తర్వాత మరో మూడు నెలల పాటు నెలకు 2వేల రూపాయల చొప్పున 12వేల రూపాయలు, ఆడపిల్ల పుడితే ప్రత్యేకంగా మరో వెయ్యి రూపాయలు కలిపి 13వేల రూపాయలు ఇస్తున్నారని తెలిపారు. అంతే కాకుండా జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ వంటి గొప్ప కంపెనీ తయారు చేసిన 15 రకాల ఉత్పత్తులతో కేసిఆర్‌ కిట్‌ ఇస్తున్నారని చెప్పారు.  ప్రసవం ముందు, తర్వాత డబ్బులు ఇస్తూ, పిల్లలకు, తల్లికి వస్త్రాలు, కేసిఆర్‌ కిట్‌ ఇచ్చి అమ్మ ఒడి వాహనంలో ఇంటి దగ్గర దించుతున్న ఏకైక ప్రభుత్వం దేశంలో తెలంగాణ ప్రభుత్వం ఒకటేనని తెలిపారు. సంక్షేమ పథకాల్లో తెలంగాణ ప్రభుత్వం దేశంలో నెంబర్‌ వన్‌ స్థానంలో ఉందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. 5300 కోట్ల రూపాయలతో 42 లక్షల మందికి ఆసరా పెన్షన్లను ఇస్తున్నామన్నారు. రాష్ట్రంలోని ప్రతి రైతుకు ప్రభుత్వమే పంట పెట్టుబడి సాయం అందించడం దేశ రైతాంగ చరిత్రలోనే సువర్ణ అధ్యాయమని అన్నారు. ఈ విషయంలో యావత్‌ దేశానికి తెలంగాణ దిక్సూచిగా నిలిచిందని చెప్పారు. వ్యవసాయం బాగుంటేనే దేశం బాగుంటుందని గుర్తించే ఈ పథకం ప్రవేశ పెట్టారని అన్నారు.  రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నీ పూర్తయితే కోటి ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. వ్యవసాయం బాగుండాలంటే భూములు, నీళ్లు, కరంటు ఉండాలని చెప్తూ.. ఇప్పటికే రికార్డుల ప్రక్షాళన పూర్తయిందని, వ్యవసాయానికి 24గంటల ఉచిత విద్యుత్‌ అందిస్తున్నామని,  దీనికితోడు నుంచి పంట పెట్టుబడి కూడా అందిస్తున్నామని చెప్పారు.